నరసరావుపేటలో బోణీ: ఏపీ పోలీసుల దూకుడు: రోడ్డు మీద కనిపిస్తే.. నేరుగా క్వారంటైన్కే
గుంటూరు: రాష్ట్రంలో పకడ్బందీగా లాక్డౌన్ పరిస్థితులను కొనసాగిస్తోన్నప్పటికీ.. కొంతమంది అత్యుత్సాహం చూపుతున్నారు. పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగాడుతున్నరు. ముఖానికి మాస్క్ను ధరించిన సందర్భాలు కూడా తక్కువే. అలాంటి వారిని కట్టడి చేయడానికి పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు వృధా అవుతూనే ఉన్నాయి. దండం పెట్టినా, దండంతో కొట్టి చెప్పినా చెవికెక్కించుకోవట్లేదు. లాక్డౌన్ నిబంధనల కింద కేసులు పెడతామని హెచ్చరించినా అదరట్లేదు.. బెదరట్లేదు. దీనితో ఏపీ పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
కర్నూలులో కాస్త తగ్గినా:ఆ రెండు జిల్లాల్లోనే తీవ్రం:కొత్తగా మళ్లీ 80 కరోనా కేసులు:సిక్కోలులో మరొకరు
రోడ్డు మీద కనిపిస్తే.. క్వారంటైన్కే
లాక్డౌన్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల మీదికి వచ్చే వారిని వచ్చినట్టుగానే క్వారంటైన్కు పంపించేయాలని నిర్ణయించుకున్నారు. దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో రోడ్డు మీద కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్లో క్వారంటైన్ సెంటర్కు పంపించారు. తాను మందుల కోసం రోడ్డు మీదికి వచ్చానని, ఇక ముందు ఇలాంటి పని ఎప్పుడూ చేయనని చెబుతున్నా వినిపించుకోలేదు. అంబులెన్స్లోకి ఎక్కించి, క్వారంటైన్ సెంటర్కు పంపించారు.
రెడ్జోన్లో నరసరావు పేట
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సుమారు తొమ్మిది వరకు నరసరావు పేటలో నమోదు అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పట్టణాన్ని రెడ్జోన్గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ.. కొందరు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగాడుతున్నారు. వాళ్లను బెదిరించో, బతిమాలో ఇంటికి పంపించే పరిస్థితులు ఇప్పుడు లేవు. సామ, దాన, దండోపాయాలను ప్రయోగించినా జనం లొంగకపోవడంతో ఇక క్వారంటైన్కు పంపించడమే మేలనుకున్నారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. దీనికోసం అంబులెన్స్ను కూడా సిద్ధం చేశారు.
ఇకపై క్వారంటైన్కే
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని నేరుగా క్వారంటైన్ సెంటర్కు పంపిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా చేయడానికి తాము చాలారకాలుగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోందని, అందుకే కనిపించిన వారిని కనిపించినట్టే అంబులెన్స్ను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నరసరావుపేట రెడ్జోన్లో ఉందని, అయినప్పటికీ.. భయం లేకుండా తిరుగాడుతుండటాన్ని నివారించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు.
అత్యధిక కేసులు నమోదైనా
కర్నూలు జిల్లా తరువాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటికే 237 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 23 కేసులు నమోదు అయ్యాయి. నరసరావుపేట సహా మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట, గుంటూరు రెడ్జోన్లల్లో ఉన్నాయి. కారెంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి, మంగళగిరి, నకిరేకల్లు, చిలకలూరిపేట, పొన్నూరు, కర్లపాలెం ఆరెంజ్ జోన్లో కొనసాగుతున్నాయి.