డబ్బులతో తస్మాత్ జాగ్రత్త: కరెన్సీ నోట్లే కాటేస్తున్నాయి..ఆ రెండు జిల్లాల్లో ఇదే జరిగింది
అమరావతి: కరోనావైరస్ ఏపీని వెంటాడుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో ఏదో ఒక మూలాన పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కరోనా వైరస్ వస్తువులపై కూడా ఉండటంతో ఏది ముట్టాలన్నా భయంగానే ఉంది. అసలు చేతులు పలానా చోట పెట్టాలంటేనే జంకుతున్నారు జనం. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరెన్సీ నోట్లపై కరోనావైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇక డబ్బులపై వైరస్ ఉండటం తద్వారా మనుషులకు సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు
కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశాయి.ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. అందులో ఏదైనా కొనుగోలు చేసేసమయంలో క్యాష్కు బదులుగా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం సూచించింది. వీలైనంత వరకు చెల్లింపులన్నీ డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చేయాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. తాజాగా గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు కేసులకు సంబంధించి హిస్టరీని పరిశీలించగా కరెన్సీ నోట్ల నుంచి వారికి కరోనా సోకిందన్న విషయాన్ని అధికారులు నిర్థారించినట్లు సమాచారం.
కరెన్సీ నోట్లే కాటేస్తున్నాయి
చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలంటూ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ఎక్కువగా చేతులపైనే కరోనావైరస్ ఉంటుందని అందుకే తరచూ సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. తలుపులు, లిఫ్ట్ డోర్లు, స్విచ్లు, కంప్యూటర్లు ఇవన్నీ చేతులతోనే ఆపరేట్ చేస్తున్నందున కరోనా వైరస్ వాటి మీదకు పాకే అవకాశం ఉంది. తాజాగా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా వైరస్ కరెన్సీ నుంచి వ్యాప్తి చెందినట్లు గుర్తించడం జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
Recommended Video
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరెన్సీ నోట్లు
ఇక ఈ మూడు జిల్లాల్లోని కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులకు బయట దేశాలనుంచి వచ్చిన చరిత్ర లేదని, ఇతరుల నుంచి రాలేదని , అయితే కరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించిందని అధికారులు గుర్తించారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు అమ్మకం చేసే సమయంలో కరెన్సీ నోట్లు మార్పిడి సందర్భంగా వీరికి వైరస్ సోకిందని చెబుతున్నారు. దీంతో ఈ మూడు జిల్లాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేబుల్ టీవీ ఆపరేటర్లు, వాటర్ క్యాన్లు సప్లయ్ చేసేవారు, పాల వ్యాపారులు తదితరులు రోజూ నగదు తీసుకుని వస్తువులను సప్లయ్ చేస్తారు. అంతేకాదు చాలా చోట్ల కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు, మెడికల్ షాపుల్లో కూడా నగదు తీసుకోవడం జరుగుతోందని అధికారులు చెప్పారు.
గుంటూరులో ఓ ఆర్ఎంపీ డాక్టరుకు కరోనా పాజిటివ్ సోకింది. అయితే ఆయన ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని వైద్యం చేశారు. ఆ కరెన్సీ నోట్ల నుంచే ఆ ఆర్ఎంపీ డాక్టర్కు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ కొన్ని సూచనలు చేసింది. మరో రెండు వారాల పాటు కరెన్సీ నోట్లను తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీచేసింది. అన్ని చెల్లింపులు డిజిటల్ పద్దతిలోనే జరగాలని పేర్కొంది. ఇదిలా ఉంటే కరోనావైరస్ ఎక్కడి నుంచి అయినా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కరెన్సీ నోట్లు ఇందుకు అతీతమేమీ కాదని పోలీస్ అధికారులు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ సర్క్యులేట్ కావడంపై స్పందించారు. ఇది రోజు వారీ జాగ్రత్త చర్యలు సూచించే క్రమంలోనే జారీ చేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు పోలీసు అధికారులు.