వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు శ్రీకృష్ణ జన్మస్థానమే: అలాంటి వార్తలు పుట్టించినా..ఫార్వర్డ్ చేసినా
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిపై వదంతులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై నిఘా ఉంచారు. ప్రత్యేకించి వాట్సప్ ద్వారా విస్తృతంగా కరోనా వైరస్కు సంబంధించిన నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వాట్సప్ గ్రూపుల కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేసినా.. సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై కేసు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మన రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన తరువాత.. వాటి సంఖ్యపై పెద్ద ఎత్తున వదంతులు వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- వాట్సప్ ద్వారా నకిలీ సమాచారాన్ని చేరవేస్తున్నారు. తమ ఊరిలోనే పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అయ్యాయని, వారంతా స్వీయ గృహనిర్బంధంలో ఉన్నారంటూ నకిలీ సమాచారాన్ని టెక్స్ట్ మెసేజీలు, వాయిస్ మెసేజీల ద్వారా చేరవేస్తున్నారు.
ఫలితంగా- ప్రజల్లో భయాందోళనలు చెలరేగడానికి కారణమౌతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర పోలీసులు.. సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై నిఘా ఉంచారు. ధృవీకరించని ఎలాంటి సమాచారాన్నయినా వాట్సప్ గ్రూపుల ద్వారా లేదా ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు.
Recommended Video
ఇక ఏపీలో కరోనా వైరస్పై అసత్య ప్రచారం చేసిన వారికి ఏపీ ప్రభుత్వం రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించనుంది. ఐపీసీలోని సెక్షన్ 270 ప్రకారం కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోనున్నారు. వాట్సప్లో గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాట్సప్లో తప్పుడు ప్రచారం చేస్తే అడ్మిన్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని, అలా కాకుండా ఉండాలంటే మత్రం ప్రైవసీ సెట్టింగులు మార్చుకోవాలని సూచిస్తున్నారు.