ఆయన చిట్టీలు అందించారా?...డిజిపికి విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి:పోలీస్ అధికారులు సంఘం డిమాండ్
అమరావతి: ఏపీ డీజీపీ కాపీ కొట్టి ఐపీఎస్ పాసయ్యారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై పోలీస్ అధికారులు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ పరీక్షలు రాస్తూ ఉంటే ఆయన చిట్టీలు అందించారా అని వ్యంగ్యంగా ప్రశ్నించింది.
డిజిపిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి వెంటనే డీజీపీకి క్షమాపణ చెప్పాలని పోలీస్ అధికారులు సంఘం డిమాండ్ చేసింది. 'డీజీపీ.. టీడీపీ కార్యకర్తవా? కాపీ కొట్టి ఐపీఎస్ పాసయ్యావా?'...అంటూ జగన్ పై దాడి నేపథ్యంలో డిజిపి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ పై దాడి జరిగిన సమాచారం తెలిసి విచారణ జరపకుండానే...ఆ దాడి చేసిన వ్యక్తి జగన్కు అభిమానిగా పేర్కొంటూ...ఉద్దేశపూర్వకంగా అతను దాడి చేయలేదని...డీజీపీ చెప్పడం హాస్యాస్పదమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకా డీజీపీకి మతి భ్రమించినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విచారణ నైపుణ్యం లేకుండానే డీజీపీ హడావుడి ప్రకటనలు చేశారని...దీన్ని బట్టి ఆయన కాపీలు కొట్టి పాసయ్యారేమోనని విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీసులను కోరినా...సరైన భద్రత చర్యలు తీసుకోలేదని విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినాయకత్వం, కొంతమంది పోలీసు అధికారులు కావాలనే జగన్ ను టార్గెట్ చేశారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.