దివ్యవాణి బూతుపురాణంపై ఘాటు స్పందన.. చంద్రబాబుకూ సీరియస్ వార్నింగ్.. పిచ్చివాగుడు వద్దన్న పోలీసులు
'సేవ్ అమరావతి' నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేతలకు ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఘాటుగా బదులిచ్చింది. డీజీపీ గౌతమ్ సవాంగ్పై చంద్రబాబు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని, అందుకాయన సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. అలాగే పోలీసుల పట్ల రాయలేని భాషలో బూతుపురాణం వినిపించిన నటి దివ్యవాణికి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం తరఫున జనకుల శ్రీనివాసరావు, నర్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మెచ్చుకున్న నోటితోనే తిట్లు..
ప్రస్తుత డీజీపీ గౌతమ్ సవాంగ్ తన సుదీర్ఘ సర్వీసులో ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేశారని, పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగుల మంచి కోసం పనిచేశారని, అలాంటి అధికారిపై అనుచితంగా మాట్లాడటం కరెక్ట్ కాదని పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. గతంలో విజయవాడ కమిషనర్ గా పనిచేసిన గౌతం సవాంగ్ ను గొప్ప అధికారి అంటూ ఇదే చంద్రబాబు మెచ్చుకున్నారని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.
చంద్రబాబుది దేశద్రోహం..
ఏపీ పోలీసులకు తన పర భేదాలు ఉండవని, అలాంటి చోట ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడాలను సృష్టించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం తీవ్రనేరమవుతుందని, ఆ లెక్కన టీడీపీ అధినేతను దేశద్రోహి అనడం కూడా తక్కువే అవుతుందని ఏపీ పోలీస్ అధికారుల సంఘం మండిపడింది. తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పోలీసుల్ని బానిసలుగా వాడుకున్నారని, ఆయన సంఘద్రోహి అని సంచలన ఆరోపణ చేసింది.
పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు..
పోలీసుల తల్లులు, భార్యలు, కూతుళ్లను ప్రస్తావిస్తూ టీడీపీ మహిళా నేత, నటి దివ్యవాణి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా అధికారుల సంఘం మండిపడింది. పిచ్చిపట్టినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించింది. శనివారం విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద అరెస్టు చేసిన సమయంలో పోలీసులను ఉద్దేశించి దివ్యవాణి బూతులు తిట్టిన వీడియోలు వైరలైన సంగతి తెలిసిందే.