ఏపీ పోలీసులకు ప్రభుత్వం షాక్- ఇక వెయిటింగ్ లో సగం కాలానికే జీతం- కొత్త రూల్స్ కలకలం..
ఏపీలో పనిచేస్తున్న వేలాది మంది పోలీసు ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పోలీసుల జీత భత్యాల నిబంధనల్లో మార్పులు చేస్తూ విడుదల చేసిన ఉత్తర్వులపై ఇప్పుడు కలకలం రేగుతోంది. ముఖ్యంగా వెయిటింగ్ ఉన్న పోలీసులకు ఇకపై సగం కాలానికే జీతభత్యాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వెయిటింగ్ పిరియడ్ లో ఉంటూ ఊరికే జీతభత్యాలు తీసుకునే పరిస్ధితి ఉండదు.
పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ల వరకూ కెరీర్లో ఏదో ఒక సమయంలో వెయిటింగ్ పిరియడ్లు ఉంటుంటాయి. ప్రభుత్వ పెద్దలకో, రాజకీయ నేతలతో, ఉన్నతాధికారులకో నచ్చకపోతే వారిని పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెడతారు. సాధారణంగా అయితే వెయిటింగ్ లో ఉన్న కాలానికి తిరిగి పోస్టింగ్ ఇచ్చాక జీతభత్యాలు అందుతాయి. కానీ తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఈ కాలంలో సగానికి మాత్రమే జీతభత్యాలు ఇవ్వనున్నారు.
Recommended Video
ఇందులో మరో సమస్య కూడా ఉంది. ఇలా వివిద కారణాలతో వెయిటింగ్ లో ఉంచిన వారి సేవలను కూడా సిబ్బంది కొరత దృష్ట్యా పోలీసుశాఖ వాడుకుంటోంది. ఇలా వెయిటింగ్ లోనూ తమ సేవలను వాడుకుంటూ కూడా జీతభత్యాలు సగం కాలానికే ఇస్తామనడంపై పోలీసు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకూ విరుద్ధమంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెయిటింగ్ ఎంత కాలం ఉఁటే అంత కాలానికి జీతం ఇవ్వాలని కోరుతున్నారు.