ఏపీలో కరోనా మాటున ప్రచారం- గీత దాటుతున్న అభ్యర్దులు- ఈసీకి ఫిర్యాదులు..
ఏపీలో ఎంతటి విపత్తు అయినా తమకు పట్టదనేది రాజకీయ నేతలు మరోసారి నిరూపిస్తున్నారు. రాష్ట్ర్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిలిచిపోవడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతోనే ఇంకా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి ఆరువారాల సమయం పూర్తవుతున్నందున ఏ క్షణమైనా ఎన్నికల ప్రకటన వస్తుందని ఆశిస్తున్న అభ్యర్ధులు.. కరోనా సాయం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ తో కరోనా వ్యాపించకుండా కట్టడి చేస్తున్న వేళ వీరి అత్యుత్సాహం ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
కరోనా మాటున ప్రచారం..
రాజకీయానికి ఏదీ అతీతం కాదనేది పాత సామెత. కానీ దాన్ని ఎప్పటికప్పుడు కొత్త తరహాలో వాడేసుకోవడం నేతలకు కొట్టిన పిండే. గత నెలలో ఏపీలో జరగాల్సిన స్ధానిక సంస్ధల ఎన్నికలు కరోనా వైరస్ ప్రభావం కారణంగా వాయిదాపడ్డాయి. ఆ తర్వాత కరోనా వ్యాప్తి మరింత పెరగడంతో కేంద్రం సూచనల మేరకు లాక్ డౌన్ కూడా విధించారు. అయితే మొదట్లో వారం రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా రోడ్లపైకి రావడం ప్రారంభించారు. అధికార, విపక్షం అన్న తేడా లేకుండా ప్రధాన పార్టీల అభ్యర్ధులు రోడ్లపైకి వచ్చేస్తున్నారు.
కరోనా సాయం పేరిట..
రాష్ట్రంలో ఉదయం వేళ లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు సడలిస్తున్న వేళ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు రైతుబజార్లు, ఇతర షాపింగ్ ప్రాంతాల్లో తిరుగుతూ జనాలకు సాయం పేరిట వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలన్న విషయాన్ని కూడా పక్కనబెట్టి రద్దీ ప్రాంతాల్లో తిరిగేస్తున్నారు. దీంతో ఇప్పుడు వీరిని ఎలా ఆపాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కరోనా డబ్బుల పేరిట వైసీపీ.. సాయం పేరుతో టీడీపీ..
ఏపీలో ప్రస్తుతం కరోనా సాయం పేరుతో ప్రభుత్వం బియ్యం కార్డులు ఉన్న వారికి వెయ్యి రూపాయలు పంపిణీ చేయిస్తోంది. అయితే వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు అందాల్సిన ఈ సాయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలే ఇళ్లకు తీసుకెళ్లి పంచిపెడుతున్నారు. దీంతో వీరిచ్చే సాయం కాదనలేక తీసుకోవాల్సిన పరిస్ధితి లబ్దిదారులది. వీరికి పోటీగా టీడీపీ అభ్యర్ధులు జనంలోకి వెళ్లి కూరగాయలు, నిత్యావసరాల పంపిణీకి తెరదీస్తున్నారు. పేదలు ఇబ్బందులు పడకూడదన్న కారణంతోనే నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకుంటూ వీరు ఎంచక్కా ప్రచారం చేసుకుంటున్నారు.
ఎస్ఈసీ, గవర్నర్ కు ఫిర్యాదులు..
కరోనా సాయం పేరుతో ఓటర్లకు ఇళ్లవద్దే డబ్బులు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు ఇప్పుడు తమకు ప్రత్యర్ధులు పోటీ వచ్చే సరికి వీరిపై గవర్నర్ కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఈ తంతు చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పేదలకు కరోనా సాయం కోసం వెయ్యి రూపాయల పంపిణీకి వాలంటీర్లు ఉండగా వైసీపీ నేతలే ఇళ్లకు వెళ్లి పంచుతున్నారని టీడీపీ, సీపీఐ వంటి పార్టీలు ఫిర్యాదులు చేశాయి. టీడీపీ నేతల నిత్యావసరాల పంపిణీపై అధికార పార్టీ నేతలు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు.