AP Rain Alert: రేపూ, ఎల్లుండీ వర్షాలే..! ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్..!
ఎల్ నినోతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులకు మరో గుడ్ న్యూస్. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు (AP Rain Alert) కురవబోతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో పాటు ఒడిశా- పశ్చిమబెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. వీటి ప్రభావంతో పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది.
అల్పపీడన ద్రోణుల ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుంటి అంటే మంగళ, బుధవారాల్లో కోస్తాజిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

మరోవైపు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి ఏలూరు జిల్లా తాడువాయిలో 71.5మిమీ, పల్నాడు జిల్లా రెంటచింతలలో 42మిమీ, కృష్ణా జిల్లా ఘంటసాలలో 41.5మిమీ, మార్కాపురం జిల్లా బోట్లగూడూరులో 40మిమీ, చిత్తూరు జిల్లా పలమనేరులో 38మిమీ, నెల్లూరు జిల్లా చిన్నమాచానేరు 33మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్ద ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే రెండు రోజులు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. అటు ప్రభుత్వం కూడా ఆయా జిల్లాల్లో పరిస్దితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.














Click it and Unblock the Notifications
