పద్మా అవార్డుకు రామోజీ రావు పేరు సిఫార్సు: వేటూరి పేరు కూడా..
హైదరాబాద్: పద్మ విభూషన్ అవార్డు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావు పేరును సిఫార్సు చేసింది. పద్మా అవార్డుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారంనాడు 30 మంది పేర్లతో ఓ జాబితాను పంపించింది. రాజమండ్రి తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యుడు, సినీ నటుడు మురళీ మోహన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అనుమతి తీసుకున్న తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణా రావు జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించి నవంబర్ కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డు విజేతలను ప్రకటిస్తుంది.
ఆ ముప్పై మంది జాబితాలో ప్రముఖ సర్జన్లు డాక్టర్ నాగేశ్వర రెడ్డి, సోమరాజు, డాక్టర్ చంద్రశేఖర్ సింహాద్రి, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేల పేర్లను కూడా ఎపి ప్రభుత్వం పద్మా అవార్డులకు సిఫార్సు చేసింది.
ఎపి ప్రభుత్వం పద్మా అవార్డుల కోసం సిఫార్సు చేసిన జాబితాలోని మరి కొందరి పేర్లు ఇలా ఉన్నాయి. నృత్యకారిణి ఆనంద శంకర్, తత్వవేత్త చాగంటి కోటేశ్వర రావు, సినీ గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి, సినీ సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్, వెంకటగిరి చేనేత కార్మికుడు రమణయ్య, కూచిపూడి నిపుణుడు పసుమర్తి రత్తయ్య, వైదిక పండితుడు మద్దూరి వేంకటేశ్వర యాజులు, చెస్ క్రీడాకారిణి హారిక.