సలత్ అల్ ఇస్తిస్కాకు ఒవైసీ పిలుపు: తెలంగాణ వ్యాప్తంగా 26న: అత్యంత అరుదు
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండ తీవ్రత మళ్లీ మొదటికొచ్చింది. చినుకు జాడ ఉండట్లేదు. నైరుతి రుతుపవనాలు మాయం అయ్యాయి. ఎల్ నినో పంజా విసురుతోంది. కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాయలసీమలో దుర్బిక్షం నెలకొంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20 జిల్లాల్లో సగటు కంటే 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించబోతోంది. అతి అరుదుగా భావించే సలత్- అల్- ఇస్తిస్కా ప్రార్థనలకు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈ నెల 26వ తేదీన ఉదయం 8 గంటలకు ఆరంభమౌతుంది. ముస్లిం సామాజిక వర్గాలు, సమాజ హితాన్ని కోరుకునే వాళ్లు ఇందులో పాల్గొనాలని కోరింది.

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి, ప్రజలకు ఉపశమనం లభించేలా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నట్లు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ప్రకటించారు. రుతుపవనాల లోటు వల్ల పలు జిల్లాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గుర్తు చేశారు. ఈ పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.
ఈ ఉదయం హైదరాబాద్ ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉర్దూ మీడియం చదువుతున్న నిరుపేద విద్యార్థులకు విద్యా కిట్లు, అధ్యయన సామగ్రిని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో తెలంగాణ దాదాపు 19 శాతం వర్షపాత లోటును ఎదుర్కొంటోందని, ఎల్ నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20కి పైగా జిల్లాల్లో కరువు లాంటి వాతావరణం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్లిష్ట సమయంలో వర్షాల కోసం ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం 'సలాత్ అల్-ఇస్తిస్కా' ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఒవైసీ నిర్ణయించారు. ఈ ప్రత్యేక ప్రార్థనల ద్వారా వర్షాలు కురిసి రైతాంగానికి, సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సమాజంలో పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మజ్లిస్ ఛారిటీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఈ విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని ఒవైసి అన్నారు.
ఈ సంవత్సరం హైదరాబాద్ లోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 11,000 మంది ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉచితంగా విద్యా కిట్లను అందజేశారు. ముస్లిం సమాజంలోని ఆడపిల్లలు తమ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలోనే నిలిపివేయకూడదని ఒవైసీ సూచించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎలాగైనా పట్టుదలతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ముస్లిం ఆడపిల్లలు ఉన్నత విద్యావంతులు కావడం ద్వారానే ఆయా కుటుంబాలు, సమాజం వేగంగా ప్రగతి సాధిస్తుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications