ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధుల వ్యయపరిమితులివే- 2011 జనాభా ప్రకారమే
ఏపీలో నాలుగు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎన్నికల ఖర్చుల పరిమితుల్ని ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నందున వాటి ప్రకారమే ఈ పరిమితుల్ని ఎస్ఈసీ నిర్ణయించింది. తాజా ఓటర్ల జాబితాను ఎస్ఈసీకి అందించడంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు విఫలమైన నేపథ్యంలో 2011 ఓటర్ల జాబితాతోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎస్ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేలు, అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్ధికి 2.5 లక్షలు ఎన్నికల వ్యయ పరిమితిగా నిర్ణయించారు. అలాగే 10 వేల కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామంలో అయితే సర్పంచ్ అభ్యర్ధికి రూ.1.5 లక్షలు వ్యయ పరిమితిగా ప్రకటించారు. మరోవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న వారికి రూ.50 వేల రూపాయలు వ్యయ పరిమితిగా నిర్ణయించారు. 10 వేల కంటే తక్కువ జనాభా ఉంటే వార్డు సభ్యుడి వ్యయ పరిమితిని రూ.30 వేలుగా నిర్ణయించారు.

దీంతో పాటు 13 జిల్లాల్లో అభ్యర్ధుల ఎన్నికల వ్యయం పరిశీలనకు ఐఎఫ్ఎస్ అధికారుల్నిపరిశీలకులుగా నియమించింది. ఇప్పటికే జనరల్ అబ్జర్వర్లుగా ఉన్న ఐఏఎస్ అధికారులతో వీరు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈసారి ఎన్నికలపై ఎస్ఈసీ గట్టిగా నిఘా పెట్టిన నేపథ్యంలో పరిశీలకుల నియామకంతో పాటు ఇతర చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications