సీఎం జగన్పై నిమ్మగడ్డ బాంబు.. ప్రాణహాని ఉందంటూ కేంద్రానికి లేఖ.. వైసీపీపై సంచలన ఆరోపణలు..
''ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిపించేందుకు ప్రయత్నిస్తున్న నాపై కొందరు కావాలని కక్షగట్టినట్లు అనిపిస్తోంది. చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నాకు, నా కుటుంబీకులకు ప్రాణహాని ఉంది. మాపై దాడి జరిగే అవకాశం ఉంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో నేను అమరావతిలో ఉండి పని చేయలేను. హైదరాబాద్ లో ఉండేందుకు అనుమతివ్వండి. లేదా కేంద్రం నుంచి భద్రతా బలగాలను పంపండి. నిజానికి ఏపీలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు'' అంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి మొరపెట్టుకున్నారు.
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)దే తుది నిర్ణయమని, అందులో కలుగజేసుకునే అధికారం మాకులేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటలకే ఎస్ఈసీ రమేశ్ సంచలన చర్యకు దిగారు. ఎన్నికల వాయిదా విషయంలో సీఎం జగన్, ఎస్ఈసీ రమేశ్ మధ్య తీవ్రబేధాభిప్రాయాలు వచ్చిన దరిమిలా.. కేంద్రం జ్యోక్యం కోరుతూ లేఖ రాయడం వివాదాస్పదమైంది.

అన్నీ సంచలనాలే..
తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతోపాటు అసలు ఏపీలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవన్న చివరి వాక్యం దాకా ఎస్ఈసీ రమేశ్ తన లేఖలో అన్నీ సంచలన అంశాలే ప్రస్తావించారు. సుదీర్ఘంగా ఐదు పేజీల్లో ఏపీకి సంబంధించిన అన్ని వివరాల్ని పూసగుచ్చినట్లు వివరించారు. నామినేషన్ల ప్రక్రియలో దాడులు, బలవంతపు ఏకగ్రీవాలను హైలైట్ చేసిన కమిషనర్.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచుతూ పట్టుబడితే సభ్యత్వం రద్దు చేస్తామన్న వైసీపీ కొత్త చట్టాన్ని కూడా లేఖలో తప్పు పట్టడం గమనార్హం.

సీఎం టార్గెట్లతోనే హింస..
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏనాడూ చూడని విధంగా 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయని, సీఎం జగన్ మంత్రులకు టార్గెట్ విధించడం వల్లే ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిందని నిమ్మగడ్డ రమేశ్ ఆరోపించారు. ‘‘2014లో కేవలం 24 శాతం ఎంపీటీసీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా 126 జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. సీఎం సొంత జిల్లా కడపలోనైతే 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. బెదిరింపులు బలంగా పనిచేశాయనడానికి ఇవే ఉదాహరణలు'' అని లేఖలో పేర్కొన్నారు.

కేంద్రమే దిగిరావాలి..
ఏపీలో హింసాయుత పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వాతావరణం అనుకూలంగా లేదని, ఎన్నికలు ప్రశాంతంగా, పక్షపాతం లేకుండా జరగాలంటే కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాలని, ప్రధానంగా కేంద్ర హోం శాఖ తక్షణమే బలగాలను ఏపీకి పంపాలని రిక్వెస్ట్ చేశారు.

ఇక్కడి అధికారుల వల్ల కాదు..
ప్రస్తుతం ఏపీలో పనిచేస్తోన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొందరు విధులు నిర్వర్తించే పరిస్థితుల్లో లేరని, కాబట్టి, సెక్యూరిటీ వ్యవహారాలతోపాటు ఎన్నికల నిర్వహణను కూడా కేంద్రమే చేపట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారు. ఎన్నికల వాయిదా విషయంలో తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానంటూ ప్రభుత్వానికి ఘాటుగా బదులిచ్చిన నిమ్మగడ్డ.. తాజాగా కేంద్రానికి రాసిన లేఖతో రాజకీయ బాంబు పేల్చినంత పనిచేశారు.

అంతా బాబు స్క్రిప్ట్ ప్రకారమే..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఏవైతే డిమాండ్లు చేస్తున్నారో... బుధవారం నాటి ఎస్ఈసీ లేఖలోనూ దాదాపు అవే అంశాలు ఉండటం గమనార్హం. ఏపీలో ఎన్నికల్ని కేంద్రమే నిర్వహించాలని, బలగాలను మోహరింపజేయాలని టీడీపీ మొదటి నుంచీ వాదిస్తున్నది. వాయిదా విషయంలో వైసీపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడం, కమిషనర్ నిర్ణయాలను కోర్టు సమర్థించడంతో టీడీపీ సంబురాలు చేసుకున్నట్లు సమాచారం.

సీఎం ఇప్పుడేం చేస్తారు?
చంద్రబాబు చెప్పినట్లు వింటూ ఎస్ఈసీ రమేశ్ కుమార్ టీడీపీ అజెండాను అమలు చేస్తున్నాడంటూ గతంలో మండిపడ్డ సీఎం జగన్.. తాజా పరిణామాలపై ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీ రాసిన లేఖపై కేంద్రంలోని బీజేపీ ఏం చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా.. ఎస్ఈసీ లేఖ ద్వారా ఇటు వైసీపీని, అటు బీజేపీని బాబు ఇరుకునపడేశారనే వాదన కూడా వినబడుతోంది.

వివరణ ఇస్తారా?
కాగా, ఎస్ఈసీ కేంద్రానికి రాసినట్లుగా చెబుతోన్న లేఖ.. ఆయన లెటర్ హెడ్, సంతకంతోనే ఉన్నప్పటికీ, ఓ వర్గం మీడియా దీనిపై భిన్నవార్తల్ని ప్రసారం చేసింది. దీంతో నిమ్మగడ్డే స్వయంగా మీడియా ముందుకు వచ్చి, కేంద్రానికి లేఖ, అందులోని సంచలన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిఉంది.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications