బాబు నిర్ణయానికి ఉద్యోగుల ఝలక్: బయోమెట్రిక్పై వ్యతిరేకత
వసతుల లేమితో ఇబ్బంది పడుతున్నందునా.. అన్ని సందర్బాల్లోను సకాలంలో సచివాలయానికి చేరుకోవడం కుదరకపోవచ్చు అని వారు చెబుతున్నారు.
విజయవాడ: అనుకున్నట్టుగానే ఏపీ సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ విషయంలో తనదైన మార్క్ తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ విధానం తప్పనిసరి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
అయితే సీఎం తీసుకున్న ఈ నిర్ణయానికి సచివాలయ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటం గమనార్హం. వసతుల లేమితో ఇబ్బంది పడుతున్నందునా.. అన్ని సందర్బాల్లోను సకాలంలో సచివాలయానికి చేరుకోవడం కుదరకపోవచ్చు అని వారు చెబుతున్నారు. ఇదే అభిప్రాయంతో సహాయ నిరాకరణ చేస్తున్నారు.
కాగా, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని జీఏడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) ఆదేశాలిచ్చింది. అయితే జీఏడీ ఆదేశాల మేరకు కేవలం 40శాతం మంది ఉద్యోగులు మాత్రమే బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు నమోదు చేయించుకున్నట్టు సీఆర్డీఏ అధికారులు తెలిపారు.
వెలగపూడి చుట్టుపక్కల వసతుల లేమి సమస్యలు ఉండటంతో.. చాలామంది మంగళగిరి-గుంటూరు నుంచి సచివాలయ విధులకు హాజరవుతున్నారు. సచివాలయానికి ఈ ప్రాంతం దూరంగా ఉండటంతో ఒక్కోసారి ఆలస్యమవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, సీఎం సెక్యూరిటీ వల్ల కూడా ఒక్కోసారి వెలగపూడికి వచ్చేందుకు ఆలస్యమవుతోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగుల వ్యతిరేకతతో సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంగాక ప్రభుత్వం తలపట్టుకున్నట్టు తెలుస్తోంది.