'అనితపై రోజా వ్యాఖ్యలు ఖండిస్తున్నాం': క్షమాపణకు డిమాండ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో దళిత ఎమ్మెల్యే అనిత పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా అసభ్య వ్యాఖ్యలు చేశారని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని టిడిపి, బిజెపి సభ్యులు ఇప్పటికే మండిపడుతున్నారు. తాజాగా, ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రంగంలోకి దిగారు. సభలో తాను చేసిన వ్యాఖ్యలకు రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీలో రోజా వ్యాఖ్యలు, ఆమె సస్పెన్షన్ చర్చనీయాంశమైంది. రోజా వ్యాఖ్యల పైన అధికార పార్టీ భగ్గుమంటోండగా, రోజా సస్పెన్షన్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా విరుచుకుపడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే రోజాను ఎంపిక చేసుకొని సస్పెన్షన్ వేశారని జగన్ కూడా ఆరోపిస్తున్నారు.
అనిత పైన చేసిన వ్యాఖ్యలకు రోజా క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... రోజా తన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసిపి మాత్రం రోజా తప్పు చేయలేదని, ఆమె పైన సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది.