హైదరాబాద్ టు బెజవాడ: మేధా టవర్స్లో సచివాలయం, మూతబడ్డ కళాశాలల్లో..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మేధా టవర్స్లో కొలువుదీరనుంది. ప్రాంతీయ కార్యాలయాలు తొలుత హైదరాబాద్ నుంచి తరలనున్నాయి. ఇంజినీరింగ్ కళాశాలల భవనాల్లో పోలీసుల విభాగాలు ఏర్పాటు చేయనున్నారు.
విభజన నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా హైదరాబాద్ నుంచి ఏపీ కార్యలయాలు బెజవాడకు తరలి వెళ్లాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా విజయవాడకు సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగవంతమవుతోంది.
ఏపీ సచివాలయాన్ని విజయవాడలోని మేధాటవర్స్, జవహర్రెడ్డి కమిటీ గుర్తించిన ప్రయివేటు భవనాల్లో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు నేపథ్యంలో ప్రస్తుతం మూసివేసిన ఇంజినీరింగ్ కళాశాలలు కీలకం కానున్నాయి.
ఏపీ సచివాలయానికి అవసరమైన స్థలాన్ని విజయవాడ, గుంటూరు పరిధిలో ప్రభుత్వం నియమించిన కమిటీ గుర్తించింది. విజయవాడలోని మేధా టవర్స్లో దాదాపు 1.75 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది.

ఆ టవర్స్ను ఐటీ కార్యకలాపాల నుంచి మిగతా కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు వీలుగా సెజ్ను డీనోటిఫై చేయాలి. ఒకట్రెండు రోజుల్లో డీనోటిఫై చేసేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేయనుంది. కేంద్రం డీనోటిఫై చేస్తే సచివాలయంలోని 8 నుంచి 10 ప్రభుత్వ విభాగాలకు నిర్మించి ఉన్న స్థలం అందుబాటులోకి వస్తుంది.
మిగతా విభాగాలకు విజయవాడ, గుంటూరు పరిసరాల్లో కొన్ని ప్రయివేటు భవనాలను కమిటీ గుర్తించింది. మేధా టవర్స్కు దగ్గర్లోని కొన్ని ప్రైవేటు భవనాల్లో మిగతా విభాగాలన్నీ కొలువుదీరనున్నాయి. విజయవాడ, గుంటూరులో పలు విభాగాలకు చెందిన ప్రాంతీయ కార్యాలయాలు, భవనాలున్నాయి.
పోలీస్ విభాగాల తరలింపుపై కొంత సందిగ్ధం నెలకొంది. పోలీసు కార్యాలయాలు నెలకొల్పేందుకు అక్కడ దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని హోంశాఖ అంచనా వేసింది. కొన్ని విభాగాలను శాశ్వత పద్ధతిన నిర్మిస్తే బాగుంటుందని తెలిపింది.
పోలీస్ విభాగాలకు విజయవాడలో రెండు భవనాలు, చుట్టూ ఖాళీ స్థలం, పరేడ్ నిర్వహించుకునేలా సౌకర్యాలు కావాలని కోరింది. అందుకు విజయవాడలో అందుబాటులో లేవు. దీంతో విజయవాడ, గుంటూరు చుట్టూ ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్ని పూర్తిగా లేదా పాక్షికంగా వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది.












Click it and Unblock the Notifications