జూన్లోపు సచివాలయం తరలింపు: బాబు, జగన్ ఓ అరాచక శక్తి: ప్రత్తిపాటి
అమరావతి: వచ్చే ఏడాది జూన్లోపు ఏపీ సచివాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
సచివాలయ భవన నిర్మాణం కోసం 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఇప్పటికే కేటాయించామన్నారు. త్వరలో 12 లక్షల 42 వేల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలలలోపు అందరికీ రేషన్ కార్డులు అందచేస్తామన్నారు.
రేషన్ షాపు డీలర్లు ఎక్కడైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రోజుకు 5 కిలోమీటర్ల చొప్పున 90 రోజుల్లో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని లేకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులతో అన్నారు.

కాల్మనీలో ఎక్కువ మంది వైసీపీ నేతలే: మంత్రి ప్రత్తిపాటి
వైసీపీ అధినేత వైయస్ జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ఓ అరాచక శక్తిగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభివర్ణించారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వైయస్ హయాంలోనే దోపిడీలు, చోరీలు, మాఫియాలు రాజ్యమేలాయని ఆరోపించారు.
సభాపతి స్థానాన్ని ఆగౌరవ పరిచేలా వైపీసీ నేతలు దిగజారుడు విమర్శలు చేశారని మండిపడ్డారు. సభాపతిని విమర్శించే హక్కు వైసీపీకి లేదన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
కాల్ మనీలో ఎక్కువ మంది వైసీపీ నేతలే ఉన్నారన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలపై మాట్లాడటం కూడా ఇందులో భాగమేనని అన్నారు. జగన్ కు ధన దాహం, అధికార దాహం తప్ప మరొకటి లేదని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చించే దమ్ము లేకే అసెంబ్లీ నుంచి జగన్ వాకౌట్ చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications