విశాఖ అనుకూలం ఎందుకంటే: లోకేష్ చూపించాడన్న అంబానీ!
విశాఖ: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణాలు ఎందుకు సురక్షితమో ఆడాగ్ చైర్మన్ అనిల్ అంబాని ఆదివారం నాడు చెప్పారు. హార్బర్ పార్క్లోని ఏపీఐఐసీ మైదానంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ అంబానీ మాట్లాడారు.
విశాఖలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశమే లేదని, శాంతిభద్రతలు ఎక్కడ అదుపులో ఉంటాయో అక్కడ అభివృద్ధి సాధ్యమని అనిల్ అంబానీ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడన్నారు. హైదరాబాదును ఆ స్థాయిలో అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందన్నారు.
విశాఖలో ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన నేవీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నారు. కోస్తా తీరం మొత్తాన్ని ఇక్కడి నుంచే నేవీ పర్యవేక్షిస్తుందని, ఇది అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతమన్నారు.
విశాఖ పెట్టుబడులకు ఎంత అనుకూలమో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పలు కార్యక్రమాల ద్వారా వివరించారన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రధాని మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా పరిపుష్టి చేసినవారవుతారన్నారు.
భారత్ రెండో స్థానంలో: చంద్రబాబు
వరల్డ్ బ్యాంకింగ్ రేట్స్లో భారత్ రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఏపీకి కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏపీలో పుష్కలంగా పారిశ్రామిక నైపుణ్యం ఉందని చెప్పారు.