హోదా కోసం ఏప్రిల్ 16న ఏపీ బంద్: హోదా సమితి, బిజెపి అరాచకాలు బయటపెడతా: బాబు
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో న్యూఢిల్లీలో వైసీపీ, టిడిపి ఎంపీల నిరసన కార్యక్రమాలపై కేంద్రం అనుసరించిన విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 16వ తేదిన రాష్ట్ర బంద్ నిర్వహించాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది.మరో వైపు బంద్ల వల్ల రాష్ట్రాభివృద్ది కుంటుపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. మోడీపై పోరాటం చేయాలని ఆయన సూచించారు. మనల్ని మనమే శిక్షించుకోవడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాసరావు గురువారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే డిమాండ్తో ఎంపీలు చేసిన ఆందోళనలను కేంద్రం అపహస్యం చేసిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని కేంద్రానికి తెలిపేందుకు గాను బంద్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చలసాని శ్రీనివాసరావు తెలిపారు.
తమ బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. బంద్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే బంద్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చలసాని శ్రీనివాసరావు చెప్పారు.అయితే ఈ బంద్కు వైసీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి.
అభివృద్ది దెబ్బతింటుంది
బంద్లు, రాస్తారోకోలు, రైలు రోకోల కారణంగా రాష్ట్రంలో అభివృద్ది దెబ్బతినే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. బంద్లతో మనల్ని మనమే శిక్షించుకోవడమేనని ఆయన చెప్పారు. అల్లర్లు, అశాంతి ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారు వెనుకడుగు వేసే అవకాశం ఉందన్నారు.
బంద్లతో మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకొంటే మోడీ ఆనందపడతాడని చెప్పారు. ఢిల్లీలో పోరాటం చేయాలని ఆయన ఆందోళనకారులకు సూచించారు. ప్రత్యేక హోదా విషయమై పోరాటం చేసే వారికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ది నిలిచిపోయేలా నిరసనలు చేయకూడదని ఆయన నిరసనకారులను కోరారు.
రాష్ట్రాన్ని విభజించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుకు ప్రజలు ఆ పార్టీని ఇంకా కూడ క్షమించలేదన్నారు. బిజెపి కూడ అదే తప్పు చేసిందన్నారు.రాష్ట్రంలో బిజెపి ఏనాడైనా గెలిచిందా అన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.ఏపీకి ఇచ్చిన హమీలు అమలు చేయకుండా మోసం చేసిన బిజెపి అరాచకాలను బట్టబయలు చేస్తానని బాబు హెచ్చరించారు.