ఏపీ బంద్, పోలీసుల కీలక నిర్ణయం!: జనసేన వీడియో, 'పవన్ తెలివిగా కన్ఫ్యూజన్ చేస్తున్నారు'
Recommended Video
అమరావతి: ప్రత్యేక హోదా సాధనా సమితి సోమవారం తలపెట్టిన బంద్కు జనసేన, వైయస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో వైసీపీ అధినే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు విరామం ఇస్తారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ముత్యాలంపాడు శిబిరం వద్ద జగన్ బస చేస్తారు. మంగళవారం పాదయాత్ర కొనసాగుతుంది.
చదవండి: మూడో కన్ను: మోడీపై బాలకృష్ణ, బీజేపీ మరో 'ఆపరేషన్ గరుడా', బయటపెడతా: శివాజీ సంచలనం
బందులో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. మరోవైపు, బంద్కు జనసేన కూడా మద్దతు తెలిపింది. జనసేన కార్యకర్తలు బందులో పాల్గొనాలని ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసారు.
చదవండి: బాబుది నోరేనా? మోడీ-జగన్ ఎలా చేస్తే అలా, 2019లో కచ్చితంగా గెలవరు: విష్ణు షాకింగ్
జనసేన పిలుపు
నిస్వార్థ నాయకుడు, నిజమైన సేవకుడు, పదవీకాంక్షలేని సామాన్యుడు, నిజాయితీలో అసామాన్యుడు, ఉద్యమ ఉదయపు శ్రామికుడు, అభ్యుదయ స్వాప్నికుడు, ప్రజా శ్రేయస్సుకై పోరాడేవాడు, ఈ జనసేనుడు, విభజన హామీల అమలు కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం, 16న ప్రత్యేక హోదా సాధన సమితి తలపెట్టిన ఏపీ బందుకు మద్దతుగా ప్రజలందరికీ మా పిలుపు అంటూ పేర్కొన్నారు.
బంద్ పైన చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్
సోమవారం నాటి బంద్పై చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బంద్ ప్రశాంతంగా సాగేలా చూడాలని ఆదేశించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరసనలు శాంతియుతంగా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అరాచక శక్తులు బందులో చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం, మన నిరసన సున్నితంగా ఉండాలన్నారు.
మన పోరాటం కేంద్రం పైన, ఢిల్లీని తాకాలి
మన పోరాటం కేంద్రం పైన అని, నిరసనలు ఢిల్లీకి తెలియజేసేలా ఉండాలని చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేయరాదన్నారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలన్నారు. మన హక్కులు సాధించుకోవాలని, రాష్ట్రానికి న్యాయం జరిగేలగా చూడాలన్నారు.
పోలీసుల హెచ్చరిక, పోలీసుల కీలక నిర్ణయం
బంద్ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బంద్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కేసులు పెడతామన్నారు. ట్రాఫిక్ అవరోధాలు కలిగించినా, ఆస్తులు ధ్వంసం చేసినా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. ఉద్యమ నేతలకు వ్యక్తిగతంగా నోటీసులు పంపిస్తామన్నారు. దీనిపై లెఫ్ట్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బంద్ విజయవంతం చేస్తామన్నారు. బంద్ విఫలం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.
పవన్ తెలివిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు.. సబ్బం హరి
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను మొదట్లో చూసి సీరియస్ పొలిటిషీయన్ అని అనుకోలేదని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాకినాడ సమావేశంలో బీజేపీపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు సీరియస్గానే ఉన్నాడనిపించిందన్నారు. ఆ తర్వాత ఎక్కువ సందర్భాల్లో టీడీపీకి మద్దతిచ్చాడని, టీడీపీని విమర్శించకుండా ఉన్నంత వరకూ పవన్ ట్రంప్ కార్డులాగానే తనకు అనిపించాడన్నారు. ప్రస్తుతం, పవన్ వైఖరి అర్థం కాకుండా ఉందని, అలా అర్థం కాకుండా ఉండటమే ఆయన వైఖరేమో, ఒకవేళ రహస్య అజెండా ఏమైనా ఆయనకు ఉందేమో అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వెళతారా, చివర్లో టీడీపీకి మద్దతిస్తారా లేక ఎవరికి మద్దతు ఇవ్వకుండా సొంతంగా ఉంటారా అనేది పవన్ చెప్పకుండా తన తెలివితేటలతో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నాడన్నారు. అందరినీ కన్ఫ్యూజన్లో పడేశాడన్నారు.
మన్మోహన్ లాంటి ప్రధానిని కించపరుస్తారా?
మరోవైపు, బీజేపీ నేతలు ఆదివారం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ నేతలు అయిదు కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేస్తున్నారని, మోడీ భజన చెల్లదని, ఆయన ఒక చెల్లని నాణెమన్నారు. కేంద్రానికి రాష్ట్ర బీజేపీ నేతలు కొమ్ముకాస్తున్నారన్నారు. హోదా ఏపీకి ఇవ్వమని చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు ఎలా ఇచ్చారన్నారు. గుజరాత్లో రూ.లక్ష కోట్లతో ఒక పట్టణాన్ని నిర్మిస్తున్న కేంద్రం ఏపీపై మాత్రం సవతితల్లి ప్రేమ చూపుతోందన్నారు. బీజేపీ విడుదల చేసిన లేఖలో తెలిపినవన్నీ అసత్యాలే అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్ లాంటి ప్రధానిని, కించపరిచేలా బీజేపీ మాట్లాడటం సరికాదన్నారు.
చంద్రబాబుకు విజయసాయి సవాల్
రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తుంగలో తొక్కారని, హోదా సాధన విషయమై చిత్తశుద్ధి లేకుండా పోరాడుతున్నారని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి విశాఖపట్నంలో అన్నారు. హోదా ఇచ్చినటువంటి పదకొండు రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఉద్యోగావకాశాలు ఏ విధంగా పెరిగాయనే విషయం చంద్రబాబుకు తెలియదా అన్నారు. హోదా అనేది సంజీవనేనని, కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా చేసిన ఘనత టీడీపీదే అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలతో కలసి లాలూచీపడి ఏపీకి తీరని అన్యాయం చేశారన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి వెళ్దామని, ప్రజా తీర్పును కోరదామన్నారు. హోదాపై ప్రజా తీర్పు ద్వారా తెలుస్తుందని సవాల్ చేశారు.