మూడో కన్ను: మోడీపై బాలకృష్ణ, బీజేపీ మరో 'ఆపరేషన్ గరుడా', బయటపెడతా: శివాజీ సంచలనం
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి పీఠం ఎక్కే అవకాశాలు లేవని గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ శనివారం అన్నారు. తాము ఏపీ ప్రయోజనాలు, హక్కుల కోసం లోకసభలో పోరాడుతుంటే కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు.
చదవండి: 'కేంద్రానికి లెక్కలు చెప్పొద్దా? చంద్రబాబుకు జేపీ అనుకూలంగా మాట్లాడటమా?'
లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఇతర పార్టీలను ఆందోళన కోసం ముందుకు తోసి కేంద్రం అప్పటికి పబ్బం గడుపుకుందన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో కేంద్రంపై పోరాడుదామన్నారు. కేంద్రం వైఖరి పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అంతర్యుద్ధం వచ్చినా రావొచ్చని, దానికి కేంద్రమే బాధ్యత వహించాలని ఎంపీ రవీంద్ర బాబు అన్నారు.
చదవండి: ఇవ్వనంటారా, చిత్తూరుకు వస్తా.. ఇంత నిరంకుశ పాలనా: బాబుపై పవన్ ఆగ్రహం, మోడీ దీక్షపై..
దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా?
కాకినాడలో ఏర్పాటు చేయాల్సిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను మహారాష్ట్రకు తరలించారని రవీంద్ర బాబు విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కేంద్రం చూస్తోందా? దక్షిణ భారత దేశాన్ని వేరు చేయాలని అనుకుంటున్నారా? ఈస్ట్ ఇండియా కంపెనీకి, మోడీ ప్రభుత్వానికి తేడా ఏమిటని, ప్రజలు తిరగబడతారన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు లేక యువత రగిలిపోతోందన్నారు.
అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు
ప్రత్యేక హోదా సహా ఏపీకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా కేంద్రానికి మంచి బుద్ధి ప్రసాదించాలని మిమ్మల్ని కోరుతున్నామంటూ పలువురు టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి శనివారం వినతిపత్రం అందించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర భవిష్యత్కు, అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము చేస్తున్న పోరాటానికి మీ ఆశీస్సులు కావాలని కోరారు.
తెలుగువాడి సత్తా చూపిద్దాం
తెలుగువాడి సత్తా కేంద్రానికి రుచి చూపేందుకు, హోదా సాధనకు మూడోనేత్రం తెరుద్దామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రం రూ.17వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, సాయం కోరితే కేంద్రం మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పి విభజన అనంతరం మొండిచేయి చూపారన్నారు. 21వ శతాబ్దం వచ్చినా పూర్తిస్థాయిలో అసమానతలు తొలగలేదన్నారు. విద్యావంతులు కాలం చెల్లిన ఆచారాలకు స్వస్తి పలకాలని, అప్పుడే అంబేడ్కర్కు ఘన నివాళి అర్పించిన వాళ్లమవుతామన్నారు. తాను 1995లో సీఎం అయ్యానని, మోడీ 2002లో అయ్యారని, ఇప్పుడు ఆ జూనియర్ మోడీ తనకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈ నెల 20న ఒకరోజు దీక్ష చేయనున్న విషయం తెలిసిందే.
ఏపీ పట్ల సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా
ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. 2017-18 గ్రాంటు కింద బీహార్కు రూ.లక్ష కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.79వేల కోట్లు, బెంగాల్కు రూ.80వేల కోట్లు ఇచ్చి తమకు మాత్రం తక్కువ ఇచ్చారన్నారు. విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. చట్టం ప్రకారం హోదా ఇవ్వాల్సిన కేంద్రం వెనుకంజ వేస్తోందని ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. ఆందోళన చేస్తుంటే పార్లమెంటు నుంచి ప్రధాని మోడీ పారిపోతున్నారన్నారు.
బీజేపీ ఆపరేషన్ గరుడ తరహా కొత్త పథకం
ఐక్య ఉద్యమాలతోనే హోదా వస్తుందని నటుడు శివాజీ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖను విశాఖలోని ఓ హోటల్లో శనివారం ఆవిష్కరించారు. అనంతరం శివాజీ మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న సహజ వాయువు, బొగ్గు, విద్యుత్తు సరఫరా నిలిపివేసి నిరసన తెలపాలన్నారు. ఆపరేషన్ గరుడ తరహాలోనే కొత్త పథకాన్ని బీజేపీ ప్రారంభించనుందని, దాని వివరాలను మే మొదటి వారంలో బయటపెడతామన్నారు.