'టీ' వాహనాలకు పన్ను: ఒక్క రాత్రికే రూ.1.30 కోట్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణ సర్కారు ఎంట్రీ ట్యాక్స్ను విధిస్తున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కూడా ఎంట్రీ ట్యాక్స్ను విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ నుంచి వచ్చే వాహనాలపై ప్రవేశ పన్ను విధిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.
దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలో పన్నులు వసూలు చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 200 వాహనాల నుంచి రూ. 1.30కోట్ల రూపాయల పన్ను వసూలు చేశారు. వీటిలో 100కు పైగా ప్రైవేట్ బస్సులు కాగా, 120 లారీలు ఉన్నాయి.

ఇక పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్పోస్టు వద్ద తెలంగాణ వాహనాల నుంచి రూ.1.82 లక్షల పన్ను వసూలు చేశారు. పన్ను వసూళ్లలో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. రాత్రి 11:30కి వచ్చిన బస్సుల నుంచి కూడా పన్ను వసూలు చేశారు.
అర్ధరాత్రి 12 గంటల నుంచి పన్ను అమల్లోకి రాగా, అంతకు గంట ముందే చెక్పోస్ట్ సిబ్బంది తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ వాహనాల డ్రైవర్లు, యజమానులు ఆందోళనకు దిగారు. నిర్ణీత సమయానికి ముందు నుంచే ఇలా చేయడం ఏమిటంటూ అర్ధరాత్రి 2.30 గంటల వరకూ ధర్నా చేశారు.
పన్ను వసూళ్లపై ప్రైవేట్ బస్సు యజమానులు ఇకపై ప్రయాణీకుల నుంచే అదనంగా చార్జీలు వసూలు చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications