స్విస్ ఛాలెంజ్ పై హైకోర్టులో కేసు...చంద్రబాబుకు ఐవైఆర్ కృష్ణారావు మరో ఝలక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అమలుచేయనున్నస్విస్ చాలెంజ్ విధానంపై ఎపి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ ఛాలెంజ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడాన్ని సవాలు చేస్తూ ఆయన ఈ పిల్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబలింగ్ చట్టం(ఏపీఐడీఈ) నిబంధనలకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు...ఈ స్విస్ ఛాలెంజ్ విధానం విరుద్ధమని, అందువల్ల దాన్ని నిలిపివేయాలని ఐవైఆర్ న్యాయస్థానాన్ని కోరారు. హైకోర్టులో ఈ నెల 20న ఈ పిల్ విచారణకు రావచ్చని భావిస్తున్నారు. అయితే రాజకీయంగా కీలకమైన తరుణంలో స్విస్ ఛాలెంజ్ పై ఐవైఆర్ కృష్ణారావు దాఖలు చేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం సిఎం చంద్రబాబుకు ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు.
ప్రయోజనం...సింగపూర్ సంస్థలకు మాత్రమే
ఎపి ప్రభుత్వం సిద్ధం చేసిన స్విస్ ఛాలెంజ్ ఒప్పందంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం ధాఖలు చేసిన ఎపి మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఈ విధానం వల్ల సింగపూర్ సంస్ధలకు మాత్రమే ఉపయోగమని తన పిటీషన్లో పేర్కొన్నారు. పైగా ఈ విధానం ఏపీఐడీఈతో పాటు సుప్రింకోర్టు మార్గదర్శకాలకు పూర్తి వ్యతిరేకం అన్నారు. అందువల్ల స్విస్ ఛాలెంజ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 179ని నిలుపుదల చేయాలని ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సిఆర్డిఏ ప్రాజెక్ట్ కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాత్రమేనని కూడా ఐవైఆర్ తన పిటీషన్ లో పేర్కొన్నారని, తన వాదనకు అవసరమైన అన్నీ డాక్యుమెంట్లను కూడా ఆయన కోర్టుకు సమర్పించారని తెలిసింది.
నిబంధనలకు వ్యతిరేకం...రాష్ట్రానికి అన్యాయం...
సింగపూర్ కు చెందిన అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్ అనే మూడు సంస్థలు, అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏడిసి) కలిసి ‘అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్' అనే ఉమ్మడి సంస్థగా ఏర్పడి మూడు దశలలో 15 ఏళ్ళలో అమరావతి నగరాన్ని నిర్మించాలన్న ఒప్పందానికి గతంలో కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంలో అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్ అనే ఈ మూడు సింగపూర్ సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలను ఎపి ప్రభుత్వం అనుసరించాలని నిర్ణయించటం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కన్సార్టియంతో సిఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలన్నీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా చేసుకున్నవేనంటూ ఐవైఆర్ తన పిటీషన్లో స్పష్టం చేసినట్లు తెలిసింది.
స్విస్ ఛాలెంజ్ విధానంపై...ఇప్పటికే అనేక కేసులు...
అయితే స్విస్ ఛాలెంజ్ పద్దతిపై హైకోర్టులో ఇప్పటికే అనేక కేసులు ఉండటం గమనార్హం. కొన్ని కేసుల్లో హై కోర్టు ప్రభుత్వానికి నొటీసులు జారీ చేయడం కూడా జరిగింది. చెన్నైకి చెందిన ‘ఎన్వీఎన్ ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్' అనే సంస్ధ గతంలో స్విస్ ఛాలెంజ్ పై కేసు దాఖలు చేస్తూ సింగపూర్ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం నిబంధనలు సవరిస్తున్నట్లు ఆరోపించింది. ఈ విషయంలో నిబంధనల మేరకే పని చెయ్యాలంటూ కోర్టు ప్రభుత్వానికి సూచించినా ప్రభుత్వం తీరులో మార్పు లేదు. ఈ నేపధ్యంలోనే ఐవైఆర్ కృష్ణారావు తాజాగా కేసు వెయ్యడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
ఈ విధానం మంచిది...అలా చెయ్యమని ఆదేశించండి
రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఓపెన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానమే మంచిదని, అందువల్ల ఓపెన్ బిడ్డింగ్ విధానాన్నే అనుసరించాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఐవైఆర్ కృష్ణారావు తన పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా జీవో 179 ద్వారా ఇప్పటికే జరిగిన ఒప్పందాలపై పనులు ప్రారంభించకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ కృష్ణారావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎపికి బడ్జెట్ లో కేటాయింపుల విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాలు చోటుచేసుకున్నతరుణంలో ఐవైఆర్ కృష్ణారావు ఈ పిల్ దాఖలు చేయడంతో సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఐవైఆర్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కావడం...తన వ్యాజ్యంలో ఆయన అనేక కీలక అంశాలను లేవనెత్తడంతో కోర్టు ఈ విషయంలో ఫిబ్రవరి 20 న జరిగే విచారణలో ఏం తేలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.