కవ్వింపు చర్యలు వీడండి - నాయకత్వ సామర్ధ్యం కష్టమైందంటూ : లోక్ సత్తా జేపీ లేఖ వైరల్..!!
ఏపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల పైన లోక్ సత్తా..ప్రజాస్వామ్య పీఠం వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్ నారాయణ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల్లో కొన్ని సూచనలతో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తో సహా రెండు పార్టీల కార్యకర్తలకు..పౌర సమాజానికి బహిరంగ లేఖ రాసారు. పార్టీల మధ్య ఈ తరహా రాజకీయం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని జేపీ ఆ లేఖలో వాపోయారు. నేతల మధ్య ఏర్పడుతున్న రాజకీయ విభేదాలు..కక్షలు..కార్పణ్యాలు..ద్వేషం.. పరుష-అనారగిక భాష సరి కాదన్నారు.
జేపీ ఆవేదనతో ఓపెన్ లెటర్
ఇవన్నీ హింస, భావోద్వేగాలకు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి పరిస్థితులు బహిరంగ చర్చ ప్రమాణాలు.. చట్టబద్ధపాలనను పరిహసిస్తోందని పేర్కొన్నారు. రాజకీయ విభేదాల్లో సైద్ధాంతిక.. విధానపరమైన అంశాలేమీ లేవని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో సంక్షోభంలో ఉన్న ఏపీ ప్రజలకు ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ఇవ్వాలంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. భావోద్వేగాలు..హింస తీవ్రంగా పెరిగిన ప్రస్తుత సమయంలో తప్పుల్ని ఎంచడం వల్ల ఉపయోగం ఉండదని జేపీ అభిప్రాయ పడ్డారు.
నాయకత్వ సామర్ధ్యంపైన కీలక వ్యాఖ్యలు
ఎదుటి వారిలో తప్పుల్ని వెతకడానికి తప్ప తమ తప్పుల్ని గుర్తించడానికి ఎవరూ ఇష్టపడరని వివరించారు. ఏపీలోని అధికార- ప్రతిపక్ష పార్టీల్లో కుల.. మతాలకు అతీతమైన అద్భుత నాయకత్వం ఉందంటూ జేపీ పేర్కొన్నారు. అలాంటి మంచి ఆలోచనలు.. మంచి నాయకత్వ సామర్థ్యం బయటపడటమే కష్టమైందంటూ వ్యాఖ్యానించారు. తీవ్ర ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఏపీ భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కలిసి పనిచేయడం ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీల ఉమ్మడి బాధ్యతగా జేపీ సూచించారు.
ఆర్థికాభివృద్ధి పెను సవాల్ గా..
అందుకు సహకరించడం.. సమాజానికి సరైన మార్గం చూపెట్టడం పౌరసమాజం తో పాటుగా పత్రికల కర్తవ్యంగా పేర్కొన్నారు. పేదలకు తాత్కాలిక సాయం అందిస్తూనే దీర్ఘకాలికంగా ఆదాయం.. యువతకు ఉపాధి పెంచే రీతిలో ఆర్థికాభివృద్ధికి సమాజాన్ని సన్నద్ధం చేయడం ప్రస్తుత రాజకీయం ముందున్న పెనుసవాల్ గా ఆయన తన లేఖలో అభిప్రాయ పడ్డారు. అభిప్రాయభేదాల్ని విస్మరించి అన్ని వర్గాల్ని కలుపుకొని సామరస్య వాతావరణాన్ని నెలకొల్పే బాధ్యత ప్రభుత్వంతో పాటుగా అన్ని రాజకీయపార్టీలకు.. మీడియాకు ఉందని పేర్కొన్నారు.
రాజకీయ వేడి చల్లార్చండి..
కవ్వింపు చర్యలు.. మాటల్ని వీడాలని... రాజకీయవేడి చల్లార్చండంటూ జేపీ తన లేఖలో అభ్యర్దించారు. పెట్టుబడులు, ఆదాయం.. ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉన్న మహానగరాన్ని రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో వనరులసద్వినియోగం .. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపుదలతో పాటుగా..పేదరిక నిర్మూలన..ఆర్థిక ప్రగతి ఉమ్మడి లక్ష్యం కావాలంటూ డా.జయప్రకాశ్ నారాయణ్ సూచించారు.