హైదరాబాద్లో అలవాటుపడి.. బెజవాడలో ఇబ్బంది: టిడిపి ఆఫీస్ కోసం వెతుకులాట
అమరావతి: నవ్యాంధ్రలో కొత్త కార్యాలయం కోసం తెలుగుదేశం పార్టీ వెతుకులాట ప్రారంభించింది. మంగళగిరి సమీపంలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతానికి కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయాన్నే ఏపీ రాష్ట్ర కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. అది పార్టీ కార్యకలాపాలకు సరిపోవడం లేదు.
పార్టీలో ఎవరైనా నాయకులు చేరినా ఆ కార్యక్రమాన్ని ఈ పార్టీ కార్యాలయంలో నిర్వహించే స్థలం లేదు. దీంతో ప్రైవేటు హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఈ కార్యక్రమాలను చేయవలసి వస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడైనా జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలన్నా ఇబ్బందులు ఎదురువుతున్నాయి.
అన్ని సౌకర్యాలున్న హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కి అలావాటుపడిన నేతలకు ఇప్పుడు చిన్న కార్యాలయంలో ఉండాల్సి రావడం ఇబ్బందిగా మారింది. విజయవాడకు ఇతర జిల్లాల నేతలు వచ్చినా పార్టీ కార్యాలయానికి వచ్చి ఉండేంత స్థలం లేదు.

ఈ నేపథ్యంలో కొత్త కార్యాలయం కోసం ఏపీ టిడిపి వెతుకుతోంది. దీనిపై నారా లోకేష్ కూడా దృష్టి సారించారు. మంగళగిరి సమీపంలో ఇప్పటికే నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించి, దానిని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఇవ్వాలని దరఖాస్తు చేశారు. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఆ స్థలం కేటాయిస్తే వెంటనే రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభించాలన్న ఆలోచనతో ఏపీ తెలుగుదేశం పార్టీ ఉంది. భవన నమూనా కూడా సిద్దం చేశారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిశాక నారా లోకేశ్ విజయవాడ పార్టీ కార్యాలయానికి వెళ్లి, దీనిపై చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications