Mudragada: ముద్రగడ మృతిపై సంతాపాల వెల్లువ..! జగన్, పవన్ సహా నేతల ప్రకటనలు..!
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (mudragada padmanabham) ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులతో పాటు సొంత పార్టీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan), ఇతర నేతలు, ఇతర పార్టీల నాయకులు కూడా వరుసగా సంతాపాలు తెలుపుతున్నారు. ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబును జగన్ ఫోన్లో పరామర్శించారు.
ముద్రగడ హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన జగన్, ఆయన మరణం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని ముద్రగడ గిరిని జగన్ కోరారు. ప్రజలకోసం ముద్రగడ అందించిన సేవలు చిరస్మరణీయమని జగన్ పేర్కొన్నారు. కాపు యోధుడు ముద్రగడ పద్మనాభం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియచేస్తున్నానంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త విచారం కలిగించిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అటు ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను, ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ తెలిపారు.
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగుతూ ప్రజా సమస్యలపై తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు పొందారని పేర్కొన్నారు. 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికై ప్రజా ప్రతినిధిగా సేవలందించడమే కాకుండా, శాసనసభ సభ్యుడిగా, కాకినాడ లోక్సభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు.
సమాజానికి ఎంతో ఇచ్చి, తనకంటూ ఏమీ మిగుల్చుకోని గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేాశారు. ప్రజా జీవితంలో నిజాయతీ, నమ్మకం, గౌరవం, ఆత్మాభిమానం, అవమానాలకు తల ఒగ్గని ధీరత్వం, అపారమైన సహనం, పేదల పట్ల అంతులేని మమకారం వంటి పదాలకు- తమ జీవితంలో ఆచరణ ద్వారా అర్థం చెప్పిన మన స్వాతంత్య్ర సమర యోధుల కోవకు చెందిన అరుదైన అగ్ర శ్రేణి నాయకుడు, మానవతా మూర్తి మన ముద్రగడ అన్నారు. ప్రజా జీవితంలో అత్యున్నత నైతిక విలువలకు ఆయనే పెద కాపు! ఆ మహాయోధుడి మరణంతో విలువల రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసినట్టు అయిందన్నారు.
















Click it and Unblock the Notifications