ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు చుక్కలు చూపిస్తాం: టీడీపీ ఎదురుదాడి, మధ్యలో రామ్ గోపాల్ వర్మ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. కేసీఆర్పై పలువురు నేతలు ఎదురుదాడి చేశారు.
ఎవరినైనా వాడుకొని వదిలేయడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని, ఆయన పచ్చి అవకాశవాది అని, రాజకీయాల కోసం ఎవరినైనా బలి చేస్తారని, నందమూరి హరికృష్ణ మరణం పైనా రాజకీయాలు చేశారని ఆయన రాజకీయ నాయకుడు కాదని, ఓ మేనేజర్ అని కేసీఆర్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కావాలని ఓసారి, వద్దని మరోసారి చెబుతారని విమర్శించారు.
చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం
చంద్రబాబు అబద్ధాలు చెబుతారని, ఇంతకాలం ప్రచారాల మీద బతికారని, ఇక ముందు అలా జరగదని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు దారుణాతి దారుణంగా ఓడిపోతారని, తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబును పొల్లుపొల్లు కొట్టినందుకు నవ్యాంధ్ర ప్రజలు సంతోషించారని చెప్పారు. మీరు చంద్రబాబుకు తగిన శాస్తి చేశారని ఏపీ వాళ్లు తమతో అంటున్నారని చెప్పారు. ఏపీ హైకోర్టును అక్కడికి మార్చుకోవాల్సింది పోయి అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అంత డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చాలా విమర్శలు చేశారు. దీనిపై ఏపీ టీడీపీ నేతలు మండిపడ్డారు.
ఇంత చండాలంగా మాట్లాడుతారా?
కేసీఆర్ సీఎం అయినంత మాత్రాన ఇంత ఛండాలంగా మాట్లాడతారా అని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై కేసీఆర్ దరిద్రమైన భాష ఉపయోగించారన్నారు. మాయమాటలు చెప్పి గెలిచినంత మాత్రాన మొనగాడివి కాలేరన్నారు. కేసీఆర్ మాటల్లో ఒక్కటైనా వాస్తవం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న ఆయన మాట ఏమైందన్నారు. చంద్రబాబు ఏం మోసం చేశారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ కంటే ఏపీ అభివృద్ధిలో ముందుందన్నారు. కేసీఆర్ భాషను ఎవరూ హర్షించరన్నారు.
ఆయనకు చుక్కలు చూపిస్తాం
తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయని, తన పార్టీ గెలిచిందని, తిరిగి అధికారం సొంతమైందని కేసీఆర్ విర్రవీగుతున్నారని మరో మంత్రి దేవినేని ఉమ అన్నారు. ముగిసింది తెలంగాణ ఎన్నికలేనని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు చుక్కలు చూపిస్తామన్నారు. ఎన్నికల్లో గెలిచినా కేబినెట్ను ఏర్పాటు చేసుకోలేని అసమర్థుడు కేసీఆర్ అన్నారు. ఆయన మాట్లాడే భాష, అసభ్య పదజాలాన్ని ఏ ఒక్కరూ హర్షించరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీదే గెలుపు అన్నారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్
చంద్రబాబు, కేసీఆర్ మాటల యుద్ధంలోకి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంతో బిజీగా ఉన్న వర్మ వీరిద్దరి మధ్య రగులుతున్న మాటల యుద్ధాన్ని తన చిత్ర ప్రమోషన్ కోసం ఉపయోగించుకున్నాడు. చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు గుప్పించగా, ఏపీ టీడీపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఈ మయంలో వర్మ స్పందించారు. కేసీఆర్ ముందుపోటు మాత్రమే పొడుస్తారని, వెన్నుపోటు పొడవరని, అందుకే ఆయన అంటే తనకు ఇష్టమని చెబుతూ ట్వీట్ చేశారు. అంతకుముందు చేసిన ట్వీట్లో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కేసు పెట్టినట్టు తనకు తెలిసిందన్నారు.