ట్యాపింగ్ శిక్షణకు ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు ట్యాపింగ్ విషయమై చెక్ రిపబ్లిక్లో శిక్షణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. అయితే, ఇది అధికారికమే. చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ పైన శిక్షణలో వారు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
రిమోట్ ట్యాపింగ్ తదితరాల పైన అవగాహనకు హాజరైనట్లుగా తెలుస్తోంది. మే 30, 2015న పలువురు అధికారులు జూలై 2 నుండి జూలై 4వ తేదీ వరకు చెక్ రిపబ్లిక్లోని ప్రాగ్లో జరిగిన 'ఇంటెలిజెన్స్ సపోర్ట్ సిస్టమ్ వరల్డ్ యూరోప్ కాన్ఫరెన్స్ కమ్ ఎక్స్ పో, ఫర్ లా ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీస్'కు హాజరయ్యేందుకు తెలంగాణ అనుమతించింది.
అలాగే, ఏపీ ప్రభుత్వం కూడా మే 29వ తేదీన పలువురు అధికారులకు అదే కాన్ఫరెన్సుకు హాజరయ్యేందుకు అనుమతించింది. ఇలాంటి శిక్షణ కోసమే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు మార్చిలో దుబాయిలో హాజరైనట్లుగా తెలుస్తోంది.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో, ఇంటెలిజెన్స్ డిపార్టుమెంటుకు చెందిన పలువురు అదికారులు 2008, 2014లో ఐఎస్ఎస్ నిర్వహించిన కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్ పోకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో మధ్య ట్యాపింగ్, ఓటుకు నోటు రగడ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.