రాజధానులపై నేడే క్లారిటీ..!! న్యాయ - శాసనాధికార పరిధిపైనా : అసెంబ్లీ వేదికగా జగన్ సర్కార్ సిద్దం..!!
ఏపీ శాసనసభ నేడు కీలక అంశాలపై చర్చకు వేదిక కానుంది. ఏపీలో కొంత కాలంగా సాగుతున్న మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వ వైఖరి ఏంటనేది సభా వేదికగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అమరావతి అంశం పైన హైకోర్టు స్పష్టతమైన తీర్పు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించింది. అదే విధంగా రైతులతో చేసుకున్న ఒప్పందాలను పూర్తి చేయాలని నిర్దేశించింది. దీంతో పాటుగా రాష్ట్ర శాసనసభకు రాజధాని మార్పు అధికారం లేదని తేల్చి చెప్పింది. ఈ తీర్పును సమీక్షించిన ప్రభుత్వం.. అప్పీల్ కు మాత్రం వెళ్లలేదు.
మూడు రాజధానుల అంశం పైనా..
ఇదే సమయంలో మూడు రాజధానులే తమ విధానమని చెబుతూ వచ్చిన ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు...మధ్యలో 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు. తాజాగా.. సరైన సమయంలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి బొత్సా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటితో (25వ తేదీ) తో ముగియనున్నాయి. దీంతో..ఈ సమావేశాల్లో కొత్తగా బిల్లులు పెట్టే అవకాశం కనిపించ టం లేదు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి రాజధాని అంశం గెలుపు - ఓటముల పైన ప్రభావితం చేసే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ అంశం పైన స్పష్టత ఇవ్వాలని .. అదే సమయంలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలను అమలు చేయాలని వైసీపీ భావిస్తోంది.
ధర్మాన లేఖ - సభలో చర్చకు చేపడితే
దీంతో..మూడు రాజధానుల పైన కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం శాసనసభ ద్వారా ఏం చెప్పబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు పైన నిర్ణయం తీసుకోవటంతో వాటి పైన ఈ చర్చలో ప్రస్తావన చేసే అవకాశం ఉంది. ఇక, మరో కీలక అంశం పైనా సభలో చర్చకు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరావతి అంశం పైన హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత వైసీపీ సీనియర్ నేత ధర్మాన సీఎం జగన్ కు లేఖ రాసారు. అందులో హైకోర్టు తీర్పు పైన తాను వ్యాఖ్యానించటం లేదని.. అయితే, శాసనసభ కు రాజధాని నిర్ణయించే అధికారం లేదంటూ తీర్పులో చెప్పారంటూ కొందరు చెబుతున్న వేళ..న్యాయ - శాసన అధికారాల పరిధి పైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సభా వేదికగానే ప్రజలకు క్లారిటీ ఇచ్చేలా
దీని పైన ఈ రోజు సభలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా, మంత్రి బొత్సా సైతం రాజధానుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని మార్పు అవకాశం లేకపోతే... అమరావతి రాజధానిగా ఖరారు చేసిన చంద్రబాబు ప్రభుత్వం..కేంద్రానికి ఆ విషయాన్ని అధికారికంగా నివేదించలేదని వెల్లడించారు. దీంతో..పునర్విభజన చట్టం ప్రకారం 2024 వరకు హైదరాబాదే రాజధాని అంటూ చెప్పుకొచ్చారు. ఇలా సాంకేతిక - న్యాయ పరమైన అంశాలతో రాజధాని వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారుతోంది. వైసీపీ తమ విధానం మారలేదని.. తమ ఆలోచనల్లో మార్పు లేదని చెబుతున్న సమయంలోనే..అమరావతి రైతులతో సీఆర్డీఏ చేసుకున్న అన్ని ఒప్పందాలను అమలు చేస్తామని చెబుతోంది. దీంతో.. ఎన్నికలకు ముందుగానే సిద్దం అవుతున్న అధికార వైసీపీ.. ఇప్పుడు సభ ద్వారా రాజధాని అంశంలో ఏం చెబుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.