ఏపీని జగన్ హత్యాంద్ర ప్రదేశ్ గా మార్చేశారు.!సీఎం జగన్ పై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.!
అమరావతి/హైదరాబాద్ : ఏపీని హత్యల ప్రదేశ్గా మార్చేశారని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ నేత కోళ్ల అప్పలనాయుడు కుమార్తె వివాహానికి హాజరైన లోకేష్ ఏపి తాజా పరిణామాల గురించి స్పందించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కిమిడి కళా వెంకటరావు ఇంటి వద్ద ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి 18 మంది టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జులతో మాట్లాడారు. బాదుడే బాదుడు కార్యక్రమం కోసం వెళుతుంటే సర్కారుపై జనాగ్రహం వెల్లువెత్తుతోందని ఇన్ ఛార్జ్ లు వివరించారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళుతున్నానని, తెలుగుదేశంపై ప్రజాదరణ రెట్టింపయ్యిందన్నారు లోకేష్. అప్సర థియేటర్ సెంటర్లో మాజీమంత్రి కొండ్రు మురళీ మోహన్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో రాజాం పరిధి ఐదు పంచాయతీల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపైనా వైసీపీ నాయకులు దాడులకి పాల్పడుతున్నారని, వైసీపీ ఎమ్మెల్సీ ఆయన కారు డ్రైవర్ ని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయుధం కోడికత్తి అయితే తెలుగుదేశం ఆయుధం పోరాడే పిడికిలి అని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ జగన్ బాదుడే బాదుడు పై యుద్ధం మొదలైందన్నారు లోకేష్. పెంచుకుంటూ పోతానని ధరలన్నీ పెంచేసిన ముఖ్యమంత్రిని గద్దె దింపడమే టిడిపి ధ్యేయమన్నారు. రాజాంలో లోకేష్ వెళుతుండగా భోగాపురం, చిలకపాలెం, పొందూరులలో తెలుగు దేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం జెండాలతో అధికసంఖ్యలో హాజరైన పసుపు సైనికులు దారిపొడవునా లోకేష్ ని ఆత్మీయంగా పలకరించారు.