18-44 వయస్సు వారికి వ్యాక్సిన్: 2022 ఫిబ్రవరి వరకూ వెయిటింగ్: జగన్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఓ ప్రకటన చేశారు. కరోనా వైరస్తో సహజీవనం చేయక తప్పదంటూ దేశంలో ఆ మహమ్మారి విజృంభించడం ఆరంభించిన తొలి రోజుల్లోనే వ్యాఖ్యానించిన ఆయన.. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్సే చేశారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ను కేంద్రబిందువుగా చేసుకుని వైఎస్ జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
18 నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాలనే కార్యక్రమాన్ని చేపట్టడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. వాస్తవ పరిస్థితి ఇదేనని అన్నారు. ఆ వయస్సు వారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుందని చెప్పారు. సెప్టెంబర్ తరువాతే దీన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సినేషన్పై ఈ మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలో ఆ వయస్సు ఉన్న వారికి టీకా ఇవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదంటూ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి.. ఈ సమీక్షా సమావేశం సందర్భంగా పునరుద్ఘాటించారు. కరోనాను అరికట్టడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోందని చెప్పారు.
దేశంలో వ్యాక్సిన్ ఉత్పాదక సామర్థ్యం ప్రతి నెలా ఏడు కోట్ల డోసులుగా ఉందని, దేశ ప్రజలందరికీ మొత్తం వేయాలంటే.. వచ్చే జనవరి నాటికి సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే ఆగస్టు నాటికి 20 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కావొచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారని, వారందరికి టీకా అందించాలంటే చాలా కాలం పడుతుందన్నారు వైఎస్ జగన్ చెప్పారు. ఆగస్టు-సెప్టెంబర్ తరువాతే 18 నుంచి 44 ఏళ్ల లోపు వయసు వారికి టీకా ఇచ్చే అవకాశం ఉందని, ఇది వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో పూర్తవుతుందని పేర్కొన్నారు. అప్పటిదాకా అప్రమత్తంగా ఉండక తప్పదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications