ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కీలక నిర్ణయం..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వ్యవస్థ ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం.. దాన్ని పూర్తి స్ధాయిలో నడపడంలో మాత్రం విఫలమైంది. దీంతో ఇప్పటికీ సచివాలయాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థపై కూటమి సర్కార్ కూడా కన్నెర్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పటికే పనిచేస్తున్న ఏపీ జేఏసీ అమరావతికి అనుబంధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఏర్పాటైంది.
గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులు అందరూ ఐక్యంగా కలిసి నడవాలని సంస్ధ అధ్యక్షుడు అర్లయ్య కోరారు. నూతన ప్రభుత్వానికి తోడ్పాటు, సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

మరోవైపు గత ప్రభుత్వ హయంలో అస్తవ్యస్తంగా ఉన్న గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రభుత్వం గాడిలో పెట్టాలని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. గత ప్రభుత్వం సకాలంలో ప్రొబెషన్ డిక్లేర్ చేయనందున ప్రతి సచివాలయ ఉద్యోగి సర్వీస్ పరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని బొప్పరాజు ఆరోపించారు. నేటికీ స్పష్టత లేని జాబ్ చార్ట్, సర్వీస్ నిబంధనలు ఉన్నాయన్నారు. కొంతమంది ఏ శాఖకు చెందినవారో కూడా తెలియని అయోమయం స్థితిలో గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులు ఉన్నారన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.












Click it and Unblock the Notifications