జగన్, చంద్రబాబు ప్రధానులైనా హోదా రాదు-బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఏపీకి విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి కాలం చెల్లినట్లే కనిపిస్తోంది ఈ హామీని అమలు చేస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఇప్పటికే 8 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. మరో రెండేళ్లు దాటితే మరో సార్వత్రిక ఎన్నికలకు కూడా రంగం సిద్దమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా హామీ ముగిసిన అధ్యాయమంటూ ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులు పార్లెమంటులో కుండబద్దలు కొట్టేశారు.
ఇప్పుడు ఇదే కోవలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా మరోమారు ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని, దానికి ప్రతిగా కేంద్రం ఇచ్చే రాయితీలను కూడా ఏపీ ప్రభుత్వం తెచ్చుకోలేకపోతోందని సుజనా ఇవాళ వ్యాఖ్యానించారు. విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభలో పాల్గొనేందుకు వచ్చిన సుజనా చౌదరి.. ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో జగన్, చంద్రబాబు ప్రధానులైనా ప్రత్యేక హోదా ఇవ్వడం జరగదన్నారు. గతంలోనూ హోదా విషయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుజనా.. తాజా వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి.
Recommended Video
మరోవైపు ఏపీలో పోలీసు వ్యవస్ధపై మరో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని సుజనా కూడా కొనసాగించారు. రాష్ట్రంలో అరాచక పాలన, పోలీసు వ్యవస్ధ పనితీరును కేంద్రం గమనిస్తోందని, దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా సుజనా చౌదరి మండిపడ్డారు. రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయమని, దాన్నెవరూ అంగుళం కూడా కదిలించలేరని సుజనా వ్యాఖ్యానించారు. తాజాగా అమరావతి పాదయాత్రకు బీజేపీ మద్దతివ్వడం వెనుక సుజనా చౌదరి ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.