పెండింగ్లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ షురూ: ఎవరి అంచనాలు వారివి
అమరావతి: రాష్ట్రంలో మిగిలిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత కూడా క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు అధికారులు. పెండింగ్లో ఉన్న ఈ స్థానాలతో పాటు..మున్సిపల్ వార్డుల రీపోలింగ్ కూడా ఇవ్వాళే కొనసాగుతోంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కమిషన్ అధికారులు రీపోలింగ్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. వేర్వేరు కారణాలు, కోర్టు కేసుల వల్ల అప్పట్లో వాటికి ఎన్నికలు జరగలేదు. అవన్నీ పరిష్కారం కావడంతో వాటిల్లో పోలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఇదివరకే నోటిఫికేషన్ను జారీ చేసింది. తొలుత పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీలు, ఆ తరువాత 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు పోలింగ్ ముగిసింది.
ఇవ్వాళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ చేపట్టింది ఎన్నికల కమిషన్. పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం వెలువడ్డాయి. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడవుతాయి. తాజాగా కొనసాగుతోన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ రిజల్ట్.. గురువారం వెలువడుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కోసం 954 కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.
మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసింది ఎస్ఈసీ. వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. అవి పోగా మిగిలిన స్థానాలకు పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 10 జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 8,07,640 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అత్యధికంగా కృష్ణా జిల్లాలో మూడు జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున జెడ్పీటీసీ స్థానాలు పెండింగ్లో ఉండగా.. వాటికి తాజాగా పోలింగ్ చేపట్టారు. బ్యాలెట్ బాక్సులో వర్షపు నీళ్లు పడటం, చెదలు పట్టడం వల్ల నిలిచిపోయిన జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోనూ పోలింగ్ చేపట్టారు.
Recommended Video
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం అభ్యర్థులు ఆయా స్థానాల్లో పోటీలో ఉన్నారు. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోండటం వల్ల.. ఆ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకోవచ్చనే అభిప్రాయాలు, అంచనాలు ఉన్నాయి.