సుదీర్ఘకాలంగా బాక్సుల్లో మగ్గిన బ్యాలెట్ పేపర్లు..ఫలితం
అమరావతి: సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, క్యాడర్ను కొంత రక్షణాత్మక వైఖరిలో పడేసిన వేళ.. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మళ్లీ జోష్ను నింపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండున్నర సంవత్సరాల తరువాత కూడా వైఎస్సార్సీపీపై ఎలాంటి వ్యతిరేక పవనాలు లేవనే సంకేతాలను పంపించాయి.
కౌంటింగ్కు లైన్ క్లియర్ కావడంతో..
రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మూడునెలల కిందటే ముగిశాయి. ఫలితాలను వెల్లడించకూడదంటూ కొందరు ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో అప్పట్లో కౌంటింగ్ వాయిదా పడింది. ఇటీవలే- ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. దీనితో కౌంటింగ్కు లైన్ క్లియర్ అయింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దీనికోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసింది.
వైసీపీ ప్రభంజనం..
ఈ ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఆరంభం నుంచీ ఆ పార్టీకి అనుకూలంగా రిజల్ట్స్ వెలువడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు వైసీపీ హవా వీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు, టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళాన్ని వైసీపీ క్లీన్స్వీప్ చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఏకపక్షంగా పోరు..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోరు చాలాచోట్ల ఏకపక్షంగా మారిందనే విషయాన్ని ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్పష్టం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి ఈ మూడు పార్టీలు కూడా. జెడ్పీటీసీల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఇదే తరహా ఫలితాలు కనిపిస్తోన్నాయి.
ఆధిక్యతలో వైసీపీ..
కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. వైసీపీ అభ్యర్థులు 38 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. మిగిలిన పార్టీలేవీ కూడా ఖాతా తెరవలేకపోయాయి. చిత్తూరు జిల్లాలో మొత్తతం 33 జెడ్పీ స్థానాలు ఉండగా.. 30 చోట్ల వైసీపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. మిగిలిన మూడో చోట్ల పోటాపోటీ నెలకొంది. కర్నూలులో 36 స్థానాలకు గాను 16 చోట్ల, ప్రకాశం జిల్లాలో 16 స్థానాలకు 16 చోట్ల వైసీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను కనపరుస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఎక్కడ గానీ టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్క చోట కూడా ఆధిక్యతలో లేవు.
బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు.. చెదలు
కాగా- సుదీర్ఘకాలం పాటు బ్యాలెట్ బాక్సులను భద్రపర్చడం వల్ల కొంత ప్రతికూలత ఏర్పడింది. కొన్ని చోట్ల ఆ బాక్సుల్లో ఉండే బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టినట్లు తెలుస్తోంది. బాక్సుల్లోకి నీరు ప్రవేశించడం వల్ల మరి కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలు తడిచి ముద్దయినట్లు సమాచారం అందుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బేజాత్పురం బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు ఉన్నట్లు తెలింది. బ్యాలెట్ పేపర్లు తడిచిపోయాయని కౌంటింగ్ సిబ్బంది చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోనూ కొన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.