పల్లెటూళ్లలో అపార్ట్మెంట్లు....ఎపి ప్రభుత్వం సరి కొత్త మరో ప్రయోగం
అమరావతి : మనం ఇప్పటివరకు అపార్ట్ మెంట్లను నగరాల్లో,పట్టణాల్లో మాత్రమే చూసి ఉంటాం...అయితే బహుళ అంతస్థుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక నూతన ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిసింది. గ్రామాల్లో అపార్ట్ మెంట్లను నిర్మంచాలనేదే ఆ ఎక్స్ పరిమెంట్. జనాభా పెరుగుదల వల్ల ఏర్పడుతున్నఇంటి స్థలాల కొరతను అధిగమించేందుకు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతిని గ్రామాలకు కూడా విస్తరించాలని ఎపి ప్రభుత్వంలోని ముఖ్యనేతలు నిర్ణయించారట.
పట్టణాలతో పాటు పల్లెటూళ్లలో కూడా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినట్లయితే తక్కువ స్థలంలోనే ఎక్కువమంది నివాసం ఉండటానికి వీలవుతుందని, తద్వారా నివాస స్థలాల కొరత సమస్యను పరిష్కరించవచ్చని ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచన చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సిఎం గ్రీన్ సిగ్నల్...
గ్రామాల్లో అపార్ట్ మెంట్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ తో తొలి ప్రాజెక్ట్ కుప్పం నియోజకవర్గంలోనే చేపట్టాలని గ్రామీణ గృహనిర్మాణశాఖ నిర్ణయం తీసుకుందని తెలసింది. 450 చదరపు అడుగుల్లో నిర్మించాలని భావిస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్టు అన్ని విధాలా విజయవంతమైన పక్షంలో మిగిలిన గ్రామీణ ప్రాంతాలకూ దీనిని విస్తరించాలనేది గ్రామీణ గృహనిర్మాణశాఖ యోచన. అవసరతను బట్టి రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా అపార్ట్మెంట్ల నిర్మాణాన్నివీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ముందస్తుగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ రూర్బన్ మిషన్ తరహాలోనే వీటిని నిర్మించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల తరహా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం రూర్బన్ ఉద్దేశం. అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లో మౌలికసదుపాయాల కల్పించడమే తప్ప ఇంటి నిర్మాణాలు లేవు.
బహుళ ప్రయోజనాలు...
అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న గ్రామీణ బహుళ అంతస్థుల నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాలతో పాటు పట్టణ తరహా ఇళ్లనూ పేదలకు అందించడం సాధ్యపడుతుంది. భవిష్యత్ లో జనాభా పెరుగుదల, కుటుంబాల సంఖ్య పెరగడం అనివార్యం కావడంతో నివాసాలు లేని లేని పేద లబ్ధిదారుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. అలాంటి అర్హులైన అందరికి నివాసాలు ఏర్పరచాలని ప్రభుత్వం భావించినా ఇంటి స్థలాలు లభ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లోనూ ఇలా అపార్ట్మెంట్ల నిర్మాణం ద్వారా వారికి ఇళ్లు ఇస్తే స్థలాల కొరతను సులభంగా అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
పల్లెటూళ్లలో టౌన్షిప్లు...
కుప్పం నియోజకవర్గంలో కనీసం రెండు వేల మంది పేదలకు ఇలా నిర్మించిన అపార్ట్మెంట్లలో ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే అధిగమించాల్సిన అవరోధాలు, బహుళ అంతస్థుల నిర్మాణానికి అనువైన స్థలాల లభ్యతపై అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ అపార్ట్ మెంట్లలో ఒక్కో ప్లాట్ 400 నుంచి 450 చదరపు అడుగల విస్తీర్ణంలో ఉండే విధంగా నిర్మించాలని భావిస్తున్నారట. ఈ ప్లాట్ లో రెండు బెడ్ రూమ్ లు, ఒక హాలు, కిచెన్, బాత్రూమ్ ఉండేలా ప్లాన్ రూపొందిస్తున్నారట. అలాగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఒకేచోట ఎక్కువ అపార్ట్మెంట్లు నిర్మించి వాటిని టౌన్షిప్ లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.