కాంగ్రెస్ లో వైసీపీ విలీనం ?- షర్మిల కీలక వ్యాఖ్యలు..
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నించి తాజా ఎన్నికల్లో విఫలమైన తర్వాత పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తొలిసారి ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో ఈ సారి జరిగిన ఎన్నికలు చాలా విచిత్రమని ఆమె తెలిపారు. ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు. మార్పు కావాలని ప్రజలు తీసుకున్న నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు. ఓకే నిర్ణయం మీద ఆధారపడి జరిగిన ఎన్నికలన్నారు. జగన్ మీద వ్యతిరేకత ఆధారంగా జరిగిన ఎన్నికలు ఇవి అన్నారు. ఈ సారి ప్రజలు తమ ఓటు కి న్యాయం జరగాలి అనుకున్నారని, మార్పు కోరుకున్నారని తెలిపారు.
ప్రజల గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈ సారి కాంగ్రెస్ కూడా మంచి ఫలితాలు తీసుకురాలేక పోయిందని షర్మిల తెలిపారు. ఎన్నికలకు ముందు 8 శాతం ఓటు బ్యాంక్ వస్తుంది అనుకున్నామని, 64 నియోజక వర్గంలో తాను సభల్లో పాల్గొన్నట్లు షర్మిల వెల్లడించారు. ప్రజలు ఈ సారి ఒక్క ఓటు కూడా వృథా కావొద్దు అనుకున్నారన్నారు. అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని, 2029లో అధికారంలో వస్తుందని తెలిపారు.

ఎన్నికల్లో గెలిచిన సీఎం చంద్రబాబుకి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఎంపీల వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కాబట్టి కేంద్రం వద్ద హోదా మీద బాబు మొండి పట్టు పట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. హోదా సాధించుకుని రావాలన్నారు. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి అని, దీనిపై శ్వేతపత్రం ఇవ్వాలని కోరారు. అలాగే సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మీరు ఇప్పుడే గెలిచారు, ఆ విషయం తమకు తెలుసని, కానీ మీకు హనీమూన్ పిరియడ్ లేదన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మక స్థాయిలో పాత్ర పోషిస్తామని షర్మిల తెలిపారు. కడప ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..అక్కడ అధికార పక్షం ఎంపీ, ఎంఎల్ఏ ఉన్నారన్నారు. అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని, ఓటుకి 3500 పైగా ఇచ్చారన్నారు. ఓడిస్తే పథకాలు ఆపుతామని బెదిరించారన్నారు. ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని, తాను ఎంపీగా గెలవక పోవడం టైం మాత్రమే అన్నారు. పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని తెలిపారు. వైసీపీ నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని, ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీ ఉంటుంది, పద్ధతి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications