చంద్రబాబు- పవన్ కూటమిపై షర్మిల అనుమానాలు
YS Sharmila: ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొన్ని వివాదాస్పద నిర్ణయాలను తీసుకోవడం దీనికి కారణమైంది.
దీనిపై అధికార టీడీపీ కూటమి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్యుద్దం సాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ చేసిన విమర్శలను మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధురాలు ఆర్ కే రోజా తిప్పి కొట్టారు. ఘాటుగా విమర్శలు గుప్పించారు.

దీనిపై తాజాగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే వైద్య విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారిందని, ఇప్పుడు దీన్ని మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు.
ఏపీలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలన్నింటినీ కూడా గుజరాత్ పబ్లిక్-ప్రైవేట్- పార్ట్నర్షిప్ విధానంలో నిర్వహించాలనే విషయంపై ఎందుకు అధ్యయనం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు వెంటనే నోరు విప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సమాధానం చెప్పాలని అన్నారు.
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ? గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని…
— YS Sharmila (@realyssharmila) September 15, 2024
ఈ ఏడాది పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో గల వైద్య కళాశాలల్లో వసతులను కల్పించలేమని, వాటిని నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదంటూ మెడికల్ బోర్డుకు చంద్రబాబు లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని షర్మిల చెప్పారు.
ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా? అని ప్రశ్నించారు. ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు అని మండిపడ్డారు. కొత్తగా 750 సీట్లు సమకూరక పోవడం పూర్తిగా చంద్రబాబు నిర్లక్ష్యం ఫలితమేనని చెప్పారు. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ను అగమ్య గోచరంగా మార్చారని, విద్యార్థుల ఆశలను నీరు గార్చారని ధ్వజమెత్తారు.
మెడికల్ సీట్ల కోసం ఏపీ విద్యార్థులు పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారంటూ షర్మిల విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి వైసీపీ సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే- ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయిని అన్నారు.












Click it and Unblock the Notifications