పవన్ కల్యాణ్..ఓ పరాన్న జీవి: బీజేపీలో విలీనం బెటర్: పొత్తులపై తులసీరెడ్డి
అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం తగ్గట్లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి రోడ్ మ్యాప్ కోసం తాము ఎదురు చూస్తున్నామంటూ ఆయన చేసిన కామెంట్స్ పట్ల కాంగ్రెస్ సైతం విమర్శలు చేసింది. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ మరో పార్టీ నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూడటానికి మించిన అవివేకం మరొకటి ఉండదని పేర్కొంది.
ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణం: అయిదుమందితో కొత్త కేబినెట్
ద్రోహం చేసిన బీజేపీతో..
రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకోవడంతోనే జనసేన నిర్వీర్యమైందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసీ రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏమిటో పవన్ కల్యాణ్కు తెలియదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు పాచిపోయిన లడ్డూలు అంటూ విమర్శించిన పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం అంటే.. రాష్ట్రానికి ద్రోహం చేసినట్టేనని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని విమర్శించారు.
యూపీఏ హయాంలో రాష్ట్రానికి వరాలు..
యూపీఏ హయాంలో ఏపీకి ఎన్నో వరాలను అందించామని గుర్తు చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వట్లేదని గుర్తు తులసీరెడ్డి గుర్తు చేశారు. కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని తాము విభజన చట్టంలో హామీ ఇచ్చామని, దాన్ని బీజేపీ ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది యూపీఏనని, ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.
అపరిపక్వతకు నిదర్శనం..
ఇలా అడుగడునా, అన్ని రంగాల్లోనూ రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న బీజేపీకి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నాడని, ఇది ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని తులసీరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసగించిన బీజేపీ ఇచ్చే రోడ్మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పడంలో అర్థం లేదని చెప్పారు. అలాంటి వ్యక్తిని పొలిటికల్ బ్రోకర్ అని పిలవొచ్చని ఆయన పవన్ కళ్యాణ్కు చురకలు అంటించారు.
రాజకీయ అజ్ఞాని..పరాన్నజీవి
సొంతగా పార్టీ పెట్టుకొని బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడంతోనే తాను రాజకీయ అజ్ఞానినని పవన్ కల్యాణ్ తనను తాను నిరూపించుకున్నారని తులసీ రెడ్డి అన్నారు. పార్టీని బీజేపీలోకి విలీనం చేయాలని ఆయన పవన్ కల్యాణ్కు సూచించారు. స్వశక్తితో రాజకీయాలు చేయలేనప్పుడు, పార్టీని బలోపేతం చేసుకోలేనప్పుడు విలీనం చేసుకోవడమే ఉత్తమం అని వ్యాఖ్యానించారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదుతానన్నట్టు పవన్ కల్యాణ్ మాట్లాడటం.. తాను పరాన్నజీవినని చెప్పకనే చెప్పుకొన్నాడని అన్నారు.