వైసీపీ నేతకు వికేంద్రీకరణ సెగ: సారీ చెప్పేంత వరకూ కదలనివ్వని జనం: కారుకు అడ్డుపడి..!
గుంటూరు: ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై గుంటూరు ప్రజల్లో ఏ రేంజ్లో వ్యతిరేకత ఉందో తెలియజేసే ఉదంతం ఇది. గుంటూరులో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ విజయ్ చందర్ను అడ్డుకున్నారు స్థానికులు. ఆయన ప్రయాణిస్తోన్న కారుకు అడ్డుపడ్డారు. కారు దిగి వచ్చి, క్షమాపణ చెప్పేంత వరకూ కదలనివ్వలేదు. చివరికి విజయ్ చందర్ సారీ చెప్పడంతో ఆయనను వెళ్లనిచ్చారు.
గుంటూరు బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది ఈ ఘటన. యువకళా వాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి విజయ్ చందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమం అయినప్పటికీ.. రాజకీయాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైఎస్: జగన్మోహన్ రెడ్డిపై పొగడ్తల వర్షాన్ని కురిపించే ప్రయత్నం చేశారు.
వైసీపీ నేతకు వికేంద్రీకరణ సెగ: కారుకు అడ్డుపడి..! pic.twitter.com/iyrabQJu3c
— Oneindia Telugu (@oneindiatelugu) January 24, 2020
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని, ఏపీ వికేంద్రీకరణ బిల్లు గురించి మాట్లాడటాన్ని ఆరంభించే సరికి అహూతుల్లో అసహనం వ్యక్తమైంది. లేచి నిల్చుని, ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. వైఎస్ జగన్ గురించి ప్రస్తావించడం, రాజకీయాల గురించి మాట్లాడటం అనవసరమని అన్నారు. వాటిని పట్టించుకోకుండా విజయ్ చందర్ తన ప్రసంగాన్ని కొనసాగించడంతో అహూతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ప్రసంగాన్ని ఆపమంటూ స్టేజీ మీదికి దూసుకెళ్లారు.

పరిస్థితి చేయి దాటుతుండటంతో యువ కళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ నిర్వాహకులు జోక్యం చేసుకున్నారు. అహూతులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. విజయ్ చందర్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి వేయించారు. విజయ్ చందర్ను ఆయన కారు వద్దకు తీసుకెళ్లారు. విజయ్ చందర్ కారు ఎక్కి వెళ్లబోతుండగా అహూతులు కదలనివ్వలేదు. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు. సుమారు అరగంట తరువాత విజయ్ చందర్తో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. అనంతరం కారు దిగి వచ్చి, రెండు చేతులు జోడించి, క్షమాపణ చెప్పారు. దీనితో వారు కారును వెళ్లనిచ్చారు.












Click it and Unblock the Notifications