భూస్వాధీనం: మహమూద్ అలీతో ఎపిఎన్జీవోల భేటీ
హైదరాబాద్: తమకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఎపిఎన్జీవోల సంఘం నాయకులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కలిశారు. గత ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు ఇచ్చిన 189 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఎపిఎన్జీవోలు డిప్యూటీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ. 15 కోట్లు ఖర్చుపెట్టి ఆ భూమిని అభివృద్ధి చేశామని వారు తెలిపారు. విద్యుత్ వైర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా ఏర్పాటు చేశామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వివరించారు.
వివాదం లేని భూమిలో లాటరీ ద్వారా 1644 మందికి ప్లాట్లు కేటాయించినట్లు అశోక్బాబు చెప్పారు. తమ విజ్ఞప్తికి టీ. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసి ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరతామని అశోక్బాబు తెలిపారు. సుప్రీంకోర్టు స్టే వల్లే తాము ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయాని ఆయన అన్నారు.