జగన్ ను ఇరికించేసిన ఏపీపీఎస్సీ ఛైర్మన్-నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్-హైకోర్టు అఫిడవిట్ తో లాస్ట్ పంచ్
ఏపీలో టీడీపీ హయాంలో రాజ్యాంగ పదవుల్లో నియామకాలు పొందిన పలువురు కీలక అధికారులను వైసీపీ సర్కార్ గత రెండేళ్లలో టార్గెట్ చేసింది. ఇదే క్రమంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్, మండలి ఛైర్మన్ షరీఫ్ తో పాటు పలువురు బాధితులుగా మిగిలిపోయారు. ఇందులో నిమ్మగడ్డ చివరి నిమిషం వరకూ సర్కార్ తో అమీతుమీ అన్నట్లుగా పోరాడి రిటైర్మెంట్ తీసుకోగా.. ఇప్పుడు అదే బాటలో మరో రాజ్యాంగ సంస్ధ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ కూడా అదే బాట పట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా గ్రూప్ 1 పరీక్షలై హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన జగన్ సర్కార్ ను ఓ రేంజ్ లో ఇరికించేశారు.
జగన్ సర్కార్లో రాజ్యాంగ పదవులు
ఏ రాష్ట్రంలో అయినా రాజ్యాంగ పదవుల్లో నియామకాలు పొందిన వారు తమను నియమించిన ప్రభుత్వాలు మారినా విధుల విషయంలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు కానీ ప్రభుత్వాలు మాత్రం వారిని నియమించిన వారి దృష్టి కోణంలోనే వారిని చూస్తుంటాయి. ఏపీలోనూ వైసీపీ సర్కార్ హయాంలో ఇదే జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ పదవుల్లో నియమించిన పలువురిని తాము అధికారంలోకి రాగానే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. చిన్నా చితకా కారణాలతో వారిని ఇబ్బందులు పెట్టడం మొదలైంది. ఇదే క్రమంలో నిమ్మగడ్డ రమేష్, ఉదయ్ భాస్కర్, షరీఫ్ వంటి వారు బాధితులుగా మారిపోయారు. వీరిలో నిమ్మగడ్డ రమేష్, షరీఫ్ ఇప్పటికే రిటైర్ కాగా ఉదయ్ భాస్కర్ ఈ ఏడాది రిటైర్ కాబోతున్నారు.
జగన్- నిమ్మగడ్డ పోరు
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన సీఎం జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ పోరు రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. టీడీపీ హయాంలో నియామకం పొంది కరోనా పేరుతో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను కులం పేరుతో టార్గెట్ చేసి గతంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో తేటతెల్లమైంది. ఆ తర్వాత ఆయన్ను ఆర్ఢినెన్స్ తీసుకొచ్చి మరీ పదవీచ్యుతుడిని చేసినా తిరిగి హైకోర్టు, సుప్రీంకోర్టు సాయంతో ఆయన పదవిలో పునర్ నియామకం అయ్యారు. చివరికి తాను అనుకున్నట్లుగానే స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించి మరీ ఆయన రిటైర్ అయ్యారు. కానీ ఈ మధ్యలో జరిగిన మాటల యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది.
జగన్-ఉదయ్ భాస్కర్ పోరు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తరహాలోనే ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ దీ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకమే. నిమ్మగడ్డ రమేష్ దూకుడుతో ప్రభుత్వంపై ఆయన చేసిన వార్ వ్యవహారం తెరపైకి రాగా.. ఉదయ్ భాస్కర్ ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటికి ఆయన సంయమనం పాటించిన తీరుతో ప్రజల్లో అంతగా చర్చకు రాకుండా పోయాయి. కానీ నిమ్మగడ్డను మించిన సహాయనిరాకరణను ఉదయ్ భాస్కర్ ఎదుర్కొన్నారు. ఆయనకు పీఏ, అటెండర్లు కూడా లేకుండా చేసి, ఛైర్మన్ అని తెలిసీ ఏపీపీఎస్సీ తీసుకునే నిర్ణయాల్లో ఆయన్ను భాగస్వామిని చేయకిుండా పక్కనబెట్టేశారు. తనకు ఉన్న అధికారాన్ని వాడకుండా ఏపీపీఎస్సీ కార్యదర్శితోనే అన్ని నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్.. అడుగడుగునా సహాయనిరాకరణ చేస్తుండటంతో గతంలో ఓసారి గవర్నర్ కు ఉదయ్ భాస్కర్ ఫిర్యాదు చేశారు. అయినా పరిస్దితిలో మార్పు లేకపోవడంతో ఆయన మిన్నకుండిపోయారు. కానీ ఇప్పుడు ఆయనకు అవకాశం దక్కింది.
అదను చూసి దెబ్బ
జగన్ సర్కార్ గత రెండేళ్ల కాలంలో తనను ఎంతగా టార్గెట్ చేసినా గవర్నర్ కు ఓసారి ఫిర్యాదు మినహా సంయమనం పాటిస్తూ వచ్చారు ఉదయ్ భాస్కర్. కానీ తాజాగా జగన్ సర్కార్ ఏపీపీఎస్సీలో తమ అనుచరుల సాయంతో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో ఇప్పుడు ఆ నెపాన్ని ఉదయ్ భాస్కర్ భరించాల్సి వస్తోంది. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాల ఆరోపణలపై దాఖలైన కేసులో ఆయన కీలక అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో జగన్ సర్కార్ ను ఆయన పూర్తిగా ఇరికించేశారు. ఈ అక్రమాలు ఎలా జరిగాయన్న దానిపై హైకోర్టుకు సవివరంగా వివరణ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.
తప్పులు మీవి- బాధ్యత నాదా ?
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పరీక్షలు రాసిన అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ నిర్ణయాలు తీసుకుంది ఏపీపీఎస్సీ ఛైర్మన్ హోదాలో ఉన్న ఉదయ్ భాస్కర్ కాదు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజేనేయులు. ప్రభుత్వం చెప్పినట్లల్లా విని ఛైర్మన్ తో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకున్న పీఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని హైకోర్టు వరకూ తెచ్చారు. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ .. ఇప్పుడు హైకోర్టుకు కీలకమైన వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఈ వివాదాలతో తనకు సంబంధం లేదని చెప్పేశారు. దీంతో హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.
Recommended Video
నిమ్మగడ్డ బాటలోనే ఉదయ్ భాస్కర్ ?
ఏపీ సర్కార్ తనను ఎప్పుడైతే టార్గెట్ చేయడం మొదలుపెట్టిందో అప్పుడే తాను న్యాయస్ధానాల ద్వారా ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని నిర్ణయించిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్.. కోర్టుల్లో వరుస పిటిషన్లు వేశారు. ప్రభుత్వం తనను ఎలా టార్గెట్ చేస్తోందో ఆధారాలతో సహా కోర్టుకు ఇచ్చారు. వీటిని పరిశీలించిన హైకోర్టు, సుప్రీంకోర్టులు నిమ్మగడ్డకు అండగా నిలిచాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ మాట వినాల్సిందేనని పలుమార్లు జగన్ సర్కార్ కు చురకలు అంటించాయి. ఇప్పుడు సరిగ్గా ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ కూడా అదే బాట ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. జగన్ సర్కార్ ఏపీపీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోర్టుకు అన్ని విషయాలు అఫిడవిట్ రూపంలో ఇచ్చారు. దీంతో ఓవైపు గ్రూప్ 1 కేసుల వ్యవహారంతో పాటు తనను జగన్ సర్కార్ టార్గెట్ చేసిన వ్యవహారాన్ని కూడా ఒకేసారి హైకోర్టు దృష్టికి తెచ్చారు. తద్వారా తాను తీసుకోని నిర్ణయాల్ని జగన్ సర్కార్ తనకు అంటగడుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.