ఏపీలోని ఆ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు: తగ్గిన ఎండ తీవ్రత
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి ఇంకో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఫలితంగా- ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించినట్టయింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏపీలో వర్షాలపై బులెటిన్ విడుదల చేసిందా సంస్థ. శనివారం వారం వరకు ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చనే విషయంపై తన అంచనాలను వెల్లడించింది.

శనివారం రాత్రి 8 గంటల నాటికి కాకినాడ జిల్లా వేలంకలో 56.2 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. ఏలేశ్వరంలో 48.5, కోటనందూరులో 45.2, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 44.5 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో కనిష్టంగా 20 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం రికార్డయింది.
అనకాపల్లి జిల్లా మాడుగుల 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల గోపవరం, శ్రీకాకుళం పొందూరులో 39.7 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణంతో పోల్చుకుంటే ఇది- రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువేననే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వర్షాల వల్ల ఎండ తీవ్రత కొంత తగ్గినట్టయింది.
నేడు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడొచ్చని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు ఎండ తీవ్రత కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ పనుల్లో ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications