ఎస్ఈసీగా నిమ్మగడ్డ చివరి రోజు: ఏం చేయబోతున్నారు?: నీలం సాహ్నీకి బాధ్యతల అప్పగింత
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం బుధవారం నాటితో ముగియనుంది. 2016లో అప్పటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ఎస్ఈసీగా నియమితులైన ఆయన అయిదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియడం వల్ల ఖాళీ కానున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానాన్ని నీలం సాహ్నీ భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేశారు. జగన్ సర్కార్ చేసిన సిఫారసుల మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమెను తదుపరి ఎస్ఈసీగా నియమించారు.
నిమ్మగడ్డ సుడిగాలి పర్యటన: పోలింగ్ బూత్లల్లో సర్ప్రైజ్ విజిట్
ప్రభుత్వాన్ని ఢీ కొట్టిన అధికారిగా
ఏడాది కాలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వార్తల్లో ఉంటూ వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టారు. పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ విషయంలో తాను అనుకున్నది సాధించారు. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీలోగా స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధుల పాలనను ఏర్పాటు చేస్తే.. వాటిని బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి 5,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహించడానికి ఆసక్తి చూపలేదు.
ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదా వేయడంతో..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటిని వాయిదా వేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిసారిగా వార్తల్లోకెక్కారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆయన చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను జగన్ సర్కార్ అర్ధాంతరంగా తొలగించడం.. ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను నియమించడం, ఎస్ఈసీ చట్టంలో సవరణలను ప్రతిపాదిస్తూ.. అయిదేళ్ల పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించడం వంటి పరిణామాలు తెర మీదికి వచ్చాయి.
జెడ్పీటీసీలు ఇంకా పెండింగ్లోనే..
ఏపీ హైకోర్టులో సవాల్ చేయడం ద్వారా రమేష్ కుమార్ వాటిని అడ్డుకోగలిగారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య న్యాయస్థానాలు వేదికగా సాగిన దాదాపు అన్ని పోరాటాల్లోనూ విజయం సాధించగలిగారు. అయిదేళ్ల పదవీ కాలం ముగియడానికి మూడు నెలలముందే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించగలిగారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఇంకా పెండింగ్లోనే ఉంటోంది. తన పదవీ కాలం ముగిసేలోగా వాటిని నిర్వహించలేమంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖను సైతం రాశారు. నిజానికి- 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాజకీయ కారణాల వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయనే అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి.
ఎంపీలతో పార్క్ హయత్ హోటల్లో భేటీ.
హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్తో ఆయన భేటీ కావడం అత్యంత వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒక పార్టీ నాయకులకు ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అపవాదును కొని తెచ్చుకున్నట్టయింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులను అందుకోవడం వంటి పలు వివాదాల మధ్యే ఆయన చివరి ఏడాది కాలం ముగిసింది.
నీలం సాహ్నీ సారథ్యంలో..
కొత్త ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్నీ.. గురువారం బాధ్యతలను స్వీకరించనున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఆమె బాధ్యతలను అందుకుంటారు. రాష్ట్రంలో ఇంకా పెండింగ్లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇక ఆమె సారథ్యంలోనే నిర్వహిస్తారు. ఏప్రిల్ రెండోవారంలో గానీ, తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత గానీ దీనికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం కావొచ్చని తెలుస్తోంది. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించనున్న విషయం తెలిసిందే.