శైవక్షేత్రాలు, శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు- రూట్లు, రేట్లు..!!
కార్తీక మాసం వేళ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర మాసంలో పలువురు పుణ్య క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. శైవక్షేత్రాలతో పాటుగా పంచారామాలు.. శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల నుంచి డిమాండ్ మేరకు నడపాలని నిర్ణయించింది. బస్సుల కేటగిరీ మేరకు ధరలను ఖరారు చేసింది. ఈ నెల మొత్తం ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది.
కార్తీకమాసం వేళ ఆర్టీసీ పలు పుణ్యక్షేత్రలకు ప్రత్యేక బస్సులను నడపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా అధికారులు ఆయా ప్రాంతాల నుంచి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇందులో కాకినాడ జిల్లాలోని కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల పరిధిలో మొత్తం 157 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. వీటిలో పంచారామ యాత్రలు, శ్రీశైల దర్శనాలు, శబరిమల ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. కాకినాడ డిపో నుంచి శ్రీశైలానికి భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ ఒక ప్రత్యేక బస్సు నడపనున్నారు. ఉదయం 7.45 గంటలకు బయలుదేరే ఈ బస్సు నెలరోజులపాటు రాకపోకలు కొనసాగిస్తుంది. తుని, ఏలేశ్వరం డిపోల నుంచీ శ్రీశైలం సర్వీసులు భక్తుల అవసరానికి అనుగుణంగా నడపనున్నట్లు వెల్లడించారు.

ఇక, కార్తికమాసం సందర్భంగా ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలను దర్శించేందుకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అక్టోబరు 25, 26తోపాటు నవంబరు 2, 9, 16 తేదీల్లో కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల నుంచి ఈ సర్వీసులు బయలుదేరతాయి. భక్తుల సౌకర్యార్థం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు ఈ సేవలకు వినియోగించనున్నారు. గతంలో 26 ప్రత్యేక సర్వీసులు నడపగా, ఈసారి 36 బస్సులు సిద్ధం చేస్తున్నారు. సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ.1120 కాగా, అల్ట్రా డీలక్స్ ధర రూ.1070గా నిర్ణయించారు. అదే విధంగా అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నారు. భక్తుల అభ్యర్థన మేరకు, వారు కోరిన ప్రాంతాల నుంచే బస్సులను కార్తికమాసం ప్రారంభం నుంచి డిసెంబరు మధ్య వరకు కొనసాగనున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications