మెగా డీఎస్సీపై తేల్చేసిన లోకేష్..! అసెంబ్లీలో ప్రకటన..!
ఏపీలో గతడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలపై ఇవాళ అసెంబ్లీలో విద్యామంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమాధానం ఇచ్చారు. డీఎస్సీని చాలా బాధ్యతగా తీసుకుని నిర్వహించామని, ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. మొత్తం 148 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందన్నారు. టీచర్ల నియామకాలు, బదిలీలు పారదర్శకంగా ఉండాలని సీఎం భావించారని, టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తుచేశారు.
తమ ప్రభుత్వం టీచర్లను సింగపూర్, ఫిన్ లాండ్ కు పంపించిందని, గతంలో వైసీపీ ప్రభుత్వం టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టిందని లోకేష్ ఆరోపించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ ఉందని, వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించవచ్చని లోకేష్ తెలిపారు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టుల్లో 336 కేసులు దాఖలు చేశారని గుర్తుచేశారు. డీఎస్సీలో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ చేయాలని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. డీఎస్సీలో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ అమలు దేశ చరిత్రలో తొలిసారి అన్నారు. టెట్ కు 3.68 లక్షల మంది దరఖాస్తు చేస్తే 1.87 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

జీవో 117తో ప్రభుత్వ పాఠశాలలు నష్టపోయాయని, టెట్ తప్పనిసరి చేసి 20శాతం వెయిటేజ్ ఇచ్చామని లోకేష్ తెలిపారు. గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే 65కు పెంచామన్నారు. వైసీపీ నేతలు కావాలనే డీఎస్సీపై 141 కేసులు వేశారని, కానీ అవేవీ కోర్టుల్లో నిలబడలేదన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ తో డీఎస్సీ నిర్వహించాలన్నారు. లీకయిన వెంటనే తెలుసుకునే వ్యవస్థను తీసుకొచ్చామని, ఎన్క్రిప్ట్ చేయలేని ఆన్లైన్ సిస్టం ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రశ్నలు ఒకేలా ఉండకుండా జంబ్లింగ్ విధానం తెచ్చామని గుర్తుచేశారు. డీఎస్సీ అర్దం తెలియని వాళ్లే పేపర్ లీక్ అని మాట్లాడుతున్నారన్నారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ పక్కాగా జరిపాకే ఉద్యోగాలిచ్చామని లోకేష్ తెలిపారు. ఏడాది తర్వాత డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ ఆరోపిస్తోందన్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారనడానికి ఆధారాలు చూపాలన్నారు. ప్రశ్నాపత్రం రూపొందించడంలో బయటివారి ప్రమేయం లేదన్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాలేదన్నారు. జగన్ ఫోన్ వాడరని, రాష్ట్రంలో ఎవ్వరూ ఫోన్ వాడరా? అని ప్రశ్నించారు. ప్రతి యువకుడి చేతిలో ఇవాళ మొబైల్ ఫోన్ ఉందని, అందుకే అభ్యర్థుల ఫోన్లకే మెసేజ్ లు పెట్టామన్నారు. నోటిఫికేషన్ నుంచి రిజల్ట్స్ వరకు పారదర్శకంగా నిర్వహించామన్నారు. కులం, మతం పేరుతో రాష్ట్రంలో వైసీపీ చిచ్చు పెడుతోందన్నారు. డీఎస్సీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని, ఎక్కడికైనా వస్తానన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే చర్చిద్దామన్నారు.













Click it and Unblock the Notifications