ఏపీఎస్ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం- కండక్టర్ చెప్పిన కారణం వింటే..?
రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్, బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.
ఈ పరిణామాల మధ్య విశాఖపనట్నంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అల్ట్రా పల్లెవెలుగు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి గాయాలు గానీ, ప్రాణాపాయ పరిస్థితులు గానీ సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బస్ నంబర్ ఏపీ 31 జెడ్ 0254. సర్వీస్ నంబర్ 111 వీ. ఈ ఉదయం విశాఖపట్నం నుంచి విజయనగరానికి బయలుదేరింది. ఆ సమయంలో బస్సులో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. సాధారణంగా ఈ బస్సుల పూర్తిస్థాయి సీటింగ్ సామర్థ్యం.. 65. దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఇందులో ఎక్కారు.
బస్టాండ్ నుంచి బయలుదేరిన ఈ బస్సు కూర్మన్నపాలెం చేరుకోగానే అగ్నిప్రమాదానికి గురైంది. తొలుత పొగ వెలువడింది. ఓ ఆటో డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించాడు. వెంటనే బస్ డ్రైవర్ రమేష్ ను హెచ్చరించాడు. దీంతో అక్కడికక్కడే బస్సును నిలిపివేశాడు డ్రైవర్. కండక్టర్ సాయిబాబాతో కలిసి ప్రయాణికులను వెంటనే కిందికి దించాడు.
ఆ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటల బారిన పడి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.
ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను సర్వీస్ రోడ్ కు మళ్లించారు. ఈ ఘటనకు ఓవర్ లోడ్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో 130 మంది ప్రయాణికులు ఉన్నారని కండక్టర్ సాయిబాబా తెలిపారు.












Click it and Unblock the Notifications