ఈ ఆర్ద్రరాత్రి నుండి ఆర్టీసీ ఛార్జీల పెంపు:కి.మీ 10 పైసల నుండి 20 పైసల వరకు:ఏసీ బస్సులకు మినహాయింపు.
ఏపీలో ఆర్టీసీ ప్రయాణీకుల పైన భారం మోపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..11వ తేదీ తొలి సర్వీసు నుండి అంటే ఈ అర్ద్రరాత్రి నుండి వీటిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటన చేసారు. కిలో మీటరుకు పది పైసల నుండి 20 పైసల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, స్లీపర్ ఏసీ బస్సులకు మాత్రం ఛార్జీల పెంపు మినహాయించారు. చివరగా 2015లో ఛార్జీలు పెంచామని..నాలుగేళ్లుగా ఎటువంటి ఛార్జీలు పెంచలేదని ఆర్టీసీ వివరించింది. ఈ సమయంలోనే డీజిల్ ధర రూ 49 నుండి రూ.70 కి పెరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు.దీని కారణంగా సంస్థ మీద దాదాపు రూ 630 కోట్ల అదనపు భారం సంస్థ మీద పడిందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటుగా పెరిగిన జీత భత్యాల కారణంగా సంస్థ మీద మరో 650 కోట్ల భారం పెరిగిందని అధికారులు వివరించారు. మొత్తంగా సంస్థ మీద 1280 కోట్ల భారం పడినా..ఆక్యెపెన్సీ రేషియో మాత్రం తగ్గకుండా 73 నుండి 79 శాతానికి పెరిగిందని లెక్కలు చెబుతున్నారు.
పెరిగిన ఛార్జీల ప్రకారం..
ఆర్టీసీ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ బస్సులతో మొదటి 11 స్టేజీలు అంటే 22 కిలో మీటర్ల వరకు ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసారు.దాదాపు 86 శాతం సిటీ సర్వీసు ప్రయాణీకుల మీద భారం ఉండదని వివిరించారు. పల్లెవెలుగు బస్సులలో మొదటి రెండు స్టేజీలకు ..అంటే 10 కిలో మీటర్ల దూరం వరకు ఎటువంటి పెంపు లేదని తేల్చారు. తదుపరి 75 కిలో మీటర్ల దూరం ప్రయాణించే వారి పైన 5 రూపాయాల భారం పడుతుందన్నారు. ఇక, దూర ప్రయాణం చేసే ఏసీ బస్సులలో మార్కెట్ కు అనుగుణంగా కేవలం 5 నుండి 7.5 శాతం మేర ఛార్జీలు సవరించా మని..స్లీపర్ ఏసీ బస్సులలో ఎటువంటి పెంపు లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

బస్సుల కేటగిరీల వారీగా..
పెంచిన ఛార్జీల ప్రకారం పల్లె వెలుగు సర్వీసుల్లో కిలో మీటరుకు రూ 10 పైసలు..ఎక్సెప్రెస్ సర్వీసుల్లో 20 పైసలు.. ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో కిలో మీటరుకు 20 పైసలు.. సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 20 పైసలు.. ఇంద్ర ఏసీ సర్వీసుల్లో కిలో మీటరుకు 10 పైసలు.. గరుడ ఏసీ బస్సుల్లో కిలో మీటర్ కు 10 పైసలు..అమరావతి ఏపీ బస్సుల్లో సైతం పది పైసలు.. వెన్నెల స్లీపర్ ఏసీ సర్వీసుల్లో మాత్రం ఎటువంటి పెంపుదల లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. 11వ తేదీ ఉదయం తొలి సర్వీసు నుండి అంటే ఈ అర్ద్రరాత్రి నుండి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి.












Click it and Unblock the Notifications