అమిత్ షా డైరెక్షన్...జగన్ యాక్షన్:ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య
విజయవాడ:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...జగన్ చెప్పినట్లు కాకుండా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లు నడుస్తోందని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎపిలోని బిజెపి నేతలను వైసిపిలో చేర్చుకోవద్దని జగన్ కు అమిత్షా ఫోన్ చేసిన విషయం వాస్తవం కాదా?...అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసిపిలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగాలేదంటూ హాస్పటల్ లో చేరడం వెనుక అమిత్ షా ఉన్న విషయం నిజం కాదా?...జవాబు చెప్పండంటూ వైసిపిని నిలదీశారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు అమిత్షా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాలతో సహా ఏ విషయమైనా మోడీని ప్రశ్నిస్తే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని జగన్ భయపడుతున్నారని వర్ల రామయ్య స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్షాను, మోడీని కాదని ఏదైనా నిర్ణయం తీసుకునే ధైర్యం జగన్కు ఉందా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. అందుకే బీజేపీ ఏ పాట పాడితే జగన్ ఆ పాట పాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
విభజన హామీలు, ప్రత్యేక హోదాను అమలు చేయాల్సింది చంద్రబాబు కాదని కేంద్ర ప్రభుత్వమని జగన్ కు గుర్తుచేశారు. జగన్ కేసుల గురించి ఏం తెలుసని కేంద్ర మంత్రి రాందాస్ వైకాపాను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామని ప్రకటన చేశారని, ఇలా కనీస అవగాహన లేని వారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండడం చాలా బాధాకరమని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
మరోవైపు అమరావతిలో టిడిపి ఎంపి కొనకళ్ల నారాయణ మీడియా తో మాట్లాడుతూ బీజేపీతో జతకట్టి జగన్ దొంగ పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. అసలు వైసీపీ తమకు ప్రత్యర్థే కాదన్నారు. మచిలీపట్నం పోర్టును వ్యతిరేకిస్తున్న జగన్కు కృష్ణా జిల్లాలో పర్యటించే అర్హత లేదన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసైనా సరే నరేంద్రమోదీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కొనకళ్ల స్పష్టం చేశారు.