ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి సిద్దా, సెజ్లపై గంటా
హైదరాబాద్: త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయని వార్తలు వస్తున్న తరణంలో మంత్రి సిద్దా రాఘవరావు స్పందించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాము ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని అన్నారు. స్పీడ్ డ్రైవింగ్, త్రాగి నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఆర్టీసీ విభజన పూర్తికావడానికి మరో రెండు నెలలు పడుతుందని, షీలాభిడే కమిటీ నివేదిక తర్వాతే ఆర్టీసీ విభజన జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు రూ. 2,300 కోట్ల అప్పులు ఉన్నాయని మంత్రి సిద్దా రాఘవ రావు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చెక్ పోస్టుల వద్ద తనిఖీలను పెంచనున్నట్లు చెప్పారు.
ఎస్ఈజెడ్లు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు: గంటా
మరో మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో మాట్లాడుతూ గత ప్రభుత్వం వేల ఎకాలు ఎస్ఈజెడ్ల రూపంలో కంపెనీలకు కేటాయించిందని, భూములు పొందిన వారు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని అన్నారు. 40 వేల మందికి ఉద్యోగాలిప్పిస్తామని కేవలం 3 వేల మందికే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. విశాఖపట్నంలో త్వరలో పరిశ్రమలు రాబోతున్నాయని అన్నారు.
అభివృద్దిలో ఆంధ్ర ప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని మంత్రి నారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయాన్ని నారాయణ దర్సించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్లో దేవాలయాలను, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని చెప్పారు.