ప్రపంచ తెలుగు మహాసభలపై నేడు విజయవాడలో సభ
విజయవాడ: ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభల వివరాల్ని వెల్లడించడానికి విజయవాడ ప్రెస్క్లబ్లో సోమవారం సాయంత్రం ప్రత్యేక సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి అన్ని వివరాలను ఈ సమావేశంలో వివరించడం జరుగుతుందని అరసం కృష్ణాజిల్లా కార్యదర్శి కొండపల్లి మాధవరావు తెలిపారు.
ఈ సమావేశానికి ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కమిటీ తరఫున పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ రచయితల సంఘం వేదిక కార్యదర్శి జూలూరి గౌరీశంకరరావు పాల్గొంటారని ఆయన తెలిపారు. కవులు, రచయితలు, తెలుగు భాషాభిమానులందరూ ఈ సమావేశానికి తరలిరావాలని కోరారు.

మరోవైపు ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేసేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ సభల సందర్భంగా తెలంగాణకు సంబంధించిన విశిష్ట సంప్రదాయ జానపద కళారూపాలు, గజ్జెల మోతలతో రాజధాని హైదరాబాద్ నగరం దద్దరిల్లేలా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

వీరితో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను ఈ సభలకు ఆహ్వానించేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నద్దమవుతోంది. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఆహ్వానించాల్సిన ప్రముఖుల జాబితాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం తెలుగు మాట్లాడే ప్రజలు జీవిస్తున్న మారిషస్, సింగపూర్, లండన్, అమెరికా, కెనడాలకు చెందిన అధికారులను కూడా ఈ సభలకు ఆహ్వానించనున్నారు. దేశంలోని బరంపురం, సూరత్, ముంబై, చెన్నై, బెంగళూరు, మైసూర్ వంటి మహానగరాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచ తెలుగు మహా సభల్లో జరిగే కార్యక్రమాలన్నింటికీ రాష్ట్ర సాహిత్య అకాడమీ కేంద్ర బిందువుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications